NEET-UG Paper Leak: దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల కలలకు గండి కొట్టిన నీట్ యూజీ పేపర్ లీకేజీ ఉదంతం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. మే 3న జరిగిన ఈ పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న మూలాలను వెతుక్కుంటూ వెళ్లిన సీబీఐ అధికారులకు దిమ్మదిరిగే నిజాలు లభ్యమవుతున్నాయి. ప్రధానంగా రాజస్థాన్లోని సీకర్ పట్టణం ఈ అక్రమ నెట్వర్క్కు అడ్డగా మారినట్టు తేలింది.
లీకేజీ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే?
దర్యాప్తు సంస్థల ప్రాథమిక అంచనా ప్రకారం నీట్ యూజీ పేపర్ మహారాష్ట్రోలని నాసిక్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా లీక్ అయింది. ఈ ముద్రణాలయానికి చెందిన ఒక వ్యక్తి పరీక్షా పత్రాన్ని బయటకు చేరవేసి, ఒక పక్కా నెట్వర్క్ ద్వారా పంపిణీ చేసినట్టు సమాచారం. నాసిక్ నుంచి ఈ పేపర్ హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన ఒక డాక్టర్కు చేరింది. అక్కడి నుంచి జైపూర్లోని జమ్వాలోని రామ్గఢ్కు చెందిన ఖాటిక్ అనే వ్యక్తి ఆ పేపర్ను కొనుగోలు చేసినట్టు సీబీఐ గుర్తించింది. ఈ వ్యవహారంలో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధం ఉన్న వ్యక్తిని ఇప్పటికే అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సీకర్ కేంద్రంగా నెట్వర్క్ విస్తరణ
జైపూర్ నుంచి ఈ లీకైన పేపర్ రాజస్థాన్లోని సీకర్కు చెందిన రాకేశ్ కుమార్ మందవారియా వద్దకు చేరింది. ఇతను సీకర్లోని ప్రధాన కోచింగ్ సెంటర్ల వద్ద ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్గా పని చేస్తుంటారు. రాకేష్ ద్వారా ఈ పేపర్ ఢిల్లీ, జమ్మూకశ్మీర్, బిహార్, కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని కోచింగ్ సెంటర్లకు పాకింది. అయితే దీనిని నేరుగా లీకైన పేపర్గా కాకుండా, నిపుణులు తయారు చేసిన గెస్ పేపర్ అనే పేరుతో అమ్మారు. గత ఏడాది ట్రెండ్స్ను బట్టి ట్యూటర్లు ఇచ్చే ప్రాక్టీస్ పేపర్లలా వీటిని సర్క్యులేట్ చేశారు.
28 లక్షల వరకు ధర పలికిన గెస్ పేపర్
ఈ లీకైన పేపర్ మే 3 పరీక్షకు దాదాపు 15 రోజుల ముందే మార్కెట్లోకి వచ్చింది. దీనిని ఒక్కో విద్యార్థికి 30 వేల నుంచి 28 లక్షల వరకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. నాగౌర్కు చెందిన ఒక విద్యార్థి పరీక్షకు నాలుగు రోజుల ముందు సీకర్కు చేరుకొని ఏకంగా రూ. 28 లక్షలు చెల్లించి ఈ పేపర్ను కొనుగోలు చేశాడు. ఆ విద్యార్థికి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పేపర్ వచ్చేసింది అని సమాచారం అందించినట్టు విచారణలో తెలిపాడు.
అసలు లీకేజీ ఎలా బయటపడింది?
చాలా గోప్యంగా సాగాల్సిన ఈ లీకేజీ వ్యవహారం కేవలం డబ్బు మీద ఆశ వల్ల బయటపడింది. నిందితుడు రాకేష్ తన వద్ద ఉన్న పేపర్ను కేవలం 30 వేలకు కేరళలో చదువుతున్న సీకర్ విద్యార్థికి విక్రయించాడు. ఆ విద్యార్థి పరీక్షకు ఒక రోజు ముందు తన తండ్రికి ఆ పేపర్ను మొబైల్లో పంపాడు. "నాన్న మా ఫ్రెండ్ పంపాడు. రేపటి పరీక్షలో ఇవే ప్రశ్నలు వస్తాయని, మన హాస్టల్ అమ్మాయిలకు ఇది ఇచ్చేయండి" అని మెసేజ్ చేశాడు. ఆ హాస్టల్ యజమాని ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పేపర్ను హాస్టల్ అమ్మాయిలందరికీ పంచేశాడు.
నిజమైన పేపర్ అని ఎలా నిర్దారణైంది?
మే 3న పరీక్ష పూర్తి అయిన తర్వాత ఆ హాస్టల్ నిర్వాహకుడు ఒక కోచింగ్ సెంటర్ టీచర్ను కలిసి తాము పంపిణీ చేసిన పేపర్లోని ప్రశ్నలు ఎన్ని వచ్చాయని ఆరా తీశాడు. ఆశ్చర్యకరంగా ఆ గెస్ పేపర్లో ఉన్న 281 ప్రశ్నల్లో అసలు నీట్ పరీక్షలో వచ్చిన 90 బయాలజీ ప్రశ్నలు, 45 కెమిస్ట్రీ ప్రశ్నలు అచ్చు గుద్దినట్టు ఉన్నాయి. కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, కెమిస్ట్రీలో 45 ప్రశ్నల క్రమం, కామాలు, పుల్స్టాప్లు కూడా అసలు పేపర్లో ఉన్నట్టుగానే ఉన్నాయి.
మొదట ఈ విషయాన్ని స్థానిక పోలీసులు కొట్టివేసినా, సదరు హాస్టల్ యజమాని ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్టీఏ సమాచారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అప్రమత్తమై రాజస్థాన్ పోలీసులు సమాచారం అందించింది. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ రంగంలోకి దిగి హాస్టల్ యజమానితో సహా 15 మందిని అరెస్టు చేసింది. అనంతరం డెహ్రడూన్, జంజును ప్రాంతాల్లో దాడులు నిర్వహించి రాకేష్ కుమార్ మందవారియాను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కోటాను మించిపోతున్న సీకర్
గతంలో రాజస్థాన్లోని కోటా జేఈఈ, నీట్ కోచింగ్లకు కేంద్రంగా ఉండేది. కానీ ఇటీవల విద్యార్థులంతా సీకర వైపు మళ్లుతున్నారు. సీకర్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద కోచింగ్ హబ్లలో ఒకటిగా మారింది. అయితే ఈ ప్రాబల్యం పెరగడంతోపాటు పేపర్ లీక్ నెట్వర్క్లు ఇక్కడ పెరిగిపోతున్నాయని అధికారులు భావిస్తున్నారు. జైపూర్లో పేపర్ మొదటి లీక్ అయినప్పటికీ సీకర్లో ఇది భారీ స్థాయిలో విస్తరించిందని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం సీబీఐ ఈ మొత్తం చైన్ను ఛేదించి, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ను పట్టుకునే పనిలో ఉంది.
