NEET Results 2022 : నీట్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం అర్ధరాత్రి విడుదల అయిన నీట్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియా 2, 3 ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5, 7, 8 ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల సంస్థల డైరెక్టర్ సుష్మ తెలిపారు. మాదాపూర్ లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నీట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఆమె మాట్లాడుతూ నీట్ ప్రవేశ పరీక్షలో మరోసారి శ్రీ చైతన్య విద్యార్థులు తమ ప్రతిభ చాటారన్నారు. ఆల్ ఇండియా 2, 3 ర్యాంకులు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5,7,8 ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో వందలోపు 17 ర్యాంకులు, ఇతర కేటగిరీలలో పదిలోపు 14, వందలోపు 69 ర్యాంకులు సాధించారన్నారు.  


దిల్లీ ఎయిమ్స్ కు 25 శాతం మంది విద్యార్థులు 


నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తున్నామని సుష్మ తెలిపారు. అనితర సాధ్యమైన ప్రోగ్రాంలు, ఇంటర్నల్ ఎగ్జామ్స్, మైక్రో షెడ్యూల్ లతో అద్బుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. నీట్ కు డిమాండ్ పెరిగిందని, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి మంచి ర్యాంకులు సాధిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో మంచిగా రాసిన విద్యార్థులే పోటీ పరీక్ష లో బాగా రాణిస్తారన్నారు. అన్ని కాంపిటేటివ్ పరీక్షలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టింస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం దిల్లీ ఎయిమ్స్ కు శ్రీ చైతన్య నుంచి 25 శాతం మంది విద్యార్థులు డాక్టర్ చదువు కోసం వెళ్లుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 8 వేల సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. 


నీట్ లో తెలుగు విద్యార్థులు హవా 


నీట్​ ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 25వ ర్యాంకు సాధించారు. బాలికల్లో  వెంకటసాయి వైష్ణవి 6వ స్థానం, చప్పిడి లక్ష్మీ చరిత 14 స్థానం, వరుం అతిథి 20 స్థానం సాధించారు. బాలురు విభాగంలో ఎర్రబెల్లి సిద్ధార్థరావు 3వ స్థానం, మట్టాదుర్గాసాయి కీర్తి తేజ 8వ స్థానం, గుల్లా హర్షవర్ధన్‌ నాయుడు 14వ స్థానం సాధించారు.  


టాప్ 50లో 8 మంది 


నీట్ ఫలితాల్లో టాప్‌ 50లో 8 మంది తెలుగు విద్యార్థులు స్థానం సాధించారు. 705 మార్కులతో మంగసముద్రం హర్షిత్‌రెడ్డి 36వ ర్యాంకు, అదే మార్కులతో తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మి చరిత 37వ ర్యాంకు, కంచన జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. 700 మార్కులతో వరుం అథితి 50వ ర్యాంకు సాధించారు.  దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలోనే తొలిర్యాంకు సాధించారు. ఏపీకి చెందిన జూటూరి నేహ 695 మార్కులతో ఆల్‌ఇండియాలో 134 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10వ స్థానంలో నిలిచారు. ఎస్సీ కేటగిరిలో ఏపీకి చెందిన చెందిన కొమ్ము ఆదర్శ్‌ 685 మార్కులతో జాతీయ స్థాయిలో 7 ఆలిండియా ర్యాంకు విభాగంలో 453వ స్థానం సాధించారు.  


Also Read : NEET Toppers: నీట్ 2022 ఫలితాల్లో 56.27 శాతం ఉత్తీర్ణత, టాప్-10లో తెలంగాణ విద్యార్థి!