మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత విద్యార్థులకు ఒక ఊరట కలిగించే వార్త వచ్చింది. కేంద్ర మాధ్యమిక  విద్యా మండలి (CBSE) గల్ఫ్ ప్రాంతంలో చదువుతున్న 12వ తరగతి విద్యార్థుల బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేసింది. ప్రవాస భారత కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలపై ఆధారపడే ఆయా దేశాల్లోని విద్యార్థులకు ఈ నిర్ణయం ఊరట కలిగిస్తుంది. 

Continues below advertisement

CBSE విడుదల చేసిన నోటీసు ప్రకారం.. బహ్రెయిన్, ఇరాన్, ఒమన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో జరగాల్సిన 12వ తరగతి పరీక్షలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ పరీక్షలు 2026 మార్చి 16 నుండి 2026 ఏప్రిల్ 10 వరకు జరగాల్సి ఉంది. మార్చి మొదటి వారంలో ఇప్పటికే వాయిదా పడిన పరీక్షలు కూడా తాజాగా పూర్తిగా రద్దు చేసినట్లు అవుతుంది. 

సిబిఎస్‌ఇ నిర్ణయం ఏంటి?

2026 మార్చి 1, 3, 5, 7, 9 తేదీల్లో వాయిదా పడిన పరీక్షలను ప్రస్తుతం రద్దు చేసినట్లు సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఈ దేశాల్లో చదువుతున్న విద్యార్థుల మూల్యాంకనం, ఫలితాల ప్రకటన ప్రక్రియను తర్వాత విడిగా వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. పరీక్షల నియంత్రణాధికారి సంయమ్ భరద్వాజ్ మాట్లాడుతూ ‘ఈ దేశాల్లోని 12వ తరగతి అభ్యర్థుల ఫలితాల ప్రకటన విధానం సరైన సమయంలో విడిగా తెలియజేస్తామని’ పేర్కొన్నారు.

ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావం, భద్రత లేదని ఆందోళనలు

మధ్య ప్రాచ్యం (పశ్చిమ ఆసియాలో)లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, అక్కడ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ తాత్కాలికంగా రద్దు చేసింది. గల్ఫ్ దేశాల్లో అనేక ప్రవాస భారత కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి పిల్లలు భారత విద్యా విధానంలో చదువుతున్నారు. ఊహించని పరిస్థితుల్లో ప్రయాణించడం, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం యుద్ధ సమయంలో సురక్షితం కానందున సీబీఎస్ఈ తీసుకున్న ఈ చొరవ విద్యార్థులకు, వారి కుటుంబాలకు ఊరటనిస్తోంది.

CISCE కూడా పరీక్షలు రద్దు

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) తీసుకున్న నిర్ణయం తర్వాత సిబిఎస్‌ఇ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో భద్రతా పరిస్థితుల కారణంగా CISCE కూడా ఇప్పటికే ICSE, ISC పరీక్షలను రద్దు చేసింది. అక్కడ భారత విద్యా బోర్డులు విద్యార్థుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాయని స్పష్టమవుతోంది.

భారత రాయబార కార్యాలయం నోటీసు విడుదల

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అక్కడి భారత విద్యార్థుల చదువులపై పడుతోంది. దోహాలోని భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 7 దేశాల్లో నివసిస్తున్న 12వ తరగతి విద్యార్థుల అన్ని పరీక్షలను బోర్డు రద్దు చేసింది. మార్చి 16 నుండి 2026 ఏప్రిల్ 10 మధ్య జరగాల్సిన అన్ని పరీక్షలు ఇకపై ఉండవు. దీనికి ముందు ఇటీవల మార్చి 1, 3, 5, 7, 9 తేదీల సర్క్యులర్ల ద్వారా వాయిదా పడిన పరీక్షలు సైతం ఇప్పుడు పూర్తిగా రద్దు చేశారు. ఈ దేశాల్లోని 12వ తరగతి విద్యార్థుల ఫలితాలను ఎలా వెల్లడిస్తారనే దానిపై CBSE విడిగా సమాచారం ఇవ్వనుంది.