IIT Madras Innovative Courses: మారుతున్న అవసరాలకు అనుగుణంగా గుణాత్మక విద్యవైపు ఐఐటీ మద్రాస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సుల మేళవింపుతో సరికొత్త బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ కోర్సును ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తోంది. బీఎస్‌ మెడికల్‌ సైన్సెస్‌ & ఇంజినీరింగ్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేస్తే సగం డాక్టర్‌ అయిపోయినట్లేనని ఆయన వెల్లడించారు. వైద్య రంగంలో రోబోలు, ఇతర సాంకేతిక వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ కోర్సుకు రూపకల్పన చేశామని, ఇప్పటివరకు 26 వేల మంది ఈ కోర్సులో చేరారని వివరించారు. 


నోబెల్ బహుమతి సాధించడమే లక్ష్యం..
ప్రపంచంలో ఇప్పటివరకు నోబెల్ బహుమతులు సాధించిన వారిలో 37 శాతం మంది మెడికల్-టెక్నాలజీ సంబంధిత శాస్త్రవేత్తలే అని, అందుకే గత ఏడాదే మేం బీఎస్ మెడికల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టామని కామకోటి తెలిపారు. ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ) ద్వారా ఈ కోర్సులో చేరొచ్చని, వచ్చే 15 సంవత్సరాల్లో ఐఐటీ మద్రాస్ కనీసం ఒక నోబెల్ బహుమతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకే ఆ కోర్సును ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. 


100 స్టార్టప్స్‌కు పేటెంట్లు..
ఐఐటీ మద్రాస్‌లో అంత్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహిస్తున్నాం. ప్రత్యేకంగా సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఐడియాతో వస్తే స్టార్టప్‌లుగా ఎదిగేందుకు కావాల్సిన మార్గదర్శనాన్ని ఈ సెంటర్‌ అందిస్తుంది. స్టార్టప్‌ల కంపెనీలకు పేటెంట్స్‌ చాలా ముఖ్యమని, రోజుకు ఒక పేటెంట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కామకోటి తెలిపారు. ఇప్పటి వరకు 366 పేటెంట్స్‌కు దరఖాస్తు చేసినట్లు, ఇప్పటికే 100 పేటెంట్స్‌ జారీ అయ్యాయని, ఈ 100 స్టార్టప్స్‌ ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది 366 పేటెంట్లను సాధించాలన్నదే లక్ష్యమని, మద్రాస్ ఐఐటీలో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌లో ఈ సంవత్సరం 100 స్టార్టప్లు రావాలని నిర్దేశించుకున్నామన్నారు. మంచి ఐడియా ఉంటే చాలు ఎవరైనా స్టార్టప్ ఇక్కడ పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు.


ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులు..
ఐఐటీ మద్రాస్‌లో 15 మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయిదు సెమిస్టర్ల తర్వాత వారు తమకు ఇష్టమైన ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర కోర్సులను చదవొచ్చు. అందువల్ల కంప్యూటర్ సైన్స్ సీటు రాలేదని మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్లో చేరామని, తమకు భవిష్యత్తు లేదని అనుకోవద్దు. భవిష్యత్తు అంతా మల్టీ డిసిప్లినరీ కోర్సులదే. కేవలం ఒక సబ్జెక్టుపై అవగాహన ఉంటే సరిపోదు. ఇప్పుడు టెక్నాలజీ లేకుండా వైద్య రంగం కూడా లేనట్లే. అంతగా సాంకేతికత మిళితమైపోయింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి బీటెక్లో మేం క్రీడా కోటాను అమలు చేయాలని నిర్ణయించాం. ఒక్కో బ్రాంచికి 1 లేదా 2 సీట్లు ఇస్తాం. క్రీడాకారులను ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యావిధానం సిఫార్సుల మేరకు దీన్ని అమలు చేయబోతున్నామని రామకోటి తెలిపారు.


‘ఏ కోర్సుల్లో చేరితే ఏం ప్రయోజనాలుంటాయో తెలియకుండానే చాలా మంది కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. తీరా చేరాక వాటితో ప్రయోజనముండదని గ్రహించి బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఐఐటీ మద్రాస్‌లో ఇంటర్‌ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టింది. డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐదో సెమిస్టర్‌ తర్వాత విద్యార్థులు ఈ కోర్సులు తీసుకోవచ్చు’ అని ప్రొఫెసర్‌ కామకోటి తెలిపారు.


రూరల్‌ ఇంటరాక్షన్‌ సెంటర్లు..
అందరికీ ఐఐటీ అనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఐఐటీ మద్రాస్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రూరల్ ఇంటరాక్షన్ సెంటర్ల పేరిట ఆన్‌లైన్ విద్య అందిస్తున్న ఐఐటీ మద్రాస్... ఈ ఏడాది ఏపీ, తెలంగాణలలోనూ వాటిని ఏర్పాటు చేయనుంది. గ్రామీణ విద్యార్థుల అండగా ఉండేందుకు సామాజిక బాధ్యతగా గ్రామాల్లో రూరల్‌ ఇంటరాక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు తమిళనాడులో 100, యూపీలో 100, శ్రీలంకలో 10 కలిపి మొత్తం 210 కేంద్రాలను ఐఐటీ మద్రాస్ ఏర్పాటుచేసింది. రాబోయే రోజుల్లో కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్‌ కామకోటి తెలిపారు. ఈ సెంటర్లల్లో టీవీ, కెమెరా, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలో వలంటీర్లు, పూర్వ విద్యార్థులు, ఫ్యా కల్టీ ఆన్‌లైన్‌ ద్వారా హాజరై విద్యార్థుల సందేహాలు తీరుస్తారు. ఉన్నత విద్యలో అవకాశాల ను వారికి వివరిస్తారు. ఓవర్సీస్‌ క్యాంపస్‌ల ఏర్పాటులో భాగంగా టాంజానియాలో ఐఐ టీ మద్రాస్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేశాం. చాలా దేశాలు వీటిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని కామకోటి పేర్కొన్నారు.


కొత్తగా స్పోర్ట్స్‌ కోటా..
క్రీడాకారులు, ఆటలను ప్రోత్సహించటంలో భాగంగా ఐఐటీ మద్రాస్‌లో కొత్తగా స్పోర్ట్స్‌ కోటాను అమలుచేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నాం. 2024-25 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కోటాను అమలుచేస్తాం. దేశంలోని ఏ ఐఐటీలోనూ ఈ తరహా విధానం అమల్లో లేదు. 10 సీట్లకు ఒక సీట్‌ను స్పోర్ట్స్‌ కోటా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీంతో ఒక్కో కోర్సులో ఒకరిద్దరు చేరే అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో 20-30 సీట్లను క్రీడాకారులకు కేటాయిస్తాం’ అని పేర్కొన్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...