International Conference at Mohan Babu University: తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఐఈఈఈ కాన్టెంపరరీ కంప్యూటింగ్ ఇన్నోవేషన్స్ కాన్ఫరెన్స్ (CCIC 2026) ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 6 , 7 తేదీల్లో దాసరి ఆడిటోరియంలో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం స్పాన్సర్షిప్ అందించింది. ఐఈఈఈ రీజియన్ 10, టెమ్స్ సంస్థలు సాంకేతిక సహకారం అందించాయి.
అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో మేధోమథనం
ఈ సదస్సులో ఆస్ట్రేలియాకు చెందిన ఐఈఈఈ కన్స్యూమర్ టెక్నాలజీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ మోజర్, ఐఈఈఈ ఇండియా కౌన్సిల్ చైర్ ప్రొఫెసర్ ప్రేరణ గౌర్, చైర్ ఎలక్ట్ ప్రొఫెసర్ ప్రీతి బజాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు చెన్నైలోని మలేషియా కాన్సులేట్ జనరల్ శరవణ కుమార్ కుమారవసగం, ఐఈఈఈ టెమ్స్ అధ్యక్షుడు డాక్టర్ సుధీంద్ర కౌశిక్, గుజరాత్ సెక్షన్ చైర్ ప్రొఫెసర్ చిరాగ్ పాన్వాలా పాల్గొన్నారు.
రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నిపుణుల ప్రసంగాలు, సాంకేతిక పత్రాల సమర్పణలు, వర్క్షాప్లు నిర్వహించారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రత్యేక సెషన్లు, విద్యార్థులకు ఉపాధి శిక్షణ, స్టార్టప్ ప్రదర్శనలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కృత్రిమ మేధ , డేటా సైన్స్, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.
పరిశోధనల్లో పారదర్శకత
డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 2,000 పైగా పరిశోధనా పత్రాలు వచ్చాయి. ఐఈఈఈ ప్రమాణాల ప్రకారం కఠినమైన సమీక్ష అనంతరం 383 పత్రాలను ఎంపిక చేశారు. వీటిని ఐఈఈఈ ఎక్స్ప్లోర్ డిజిటల్ లైబ్రరీ, స్కోపస్లలో పొందుపరుస్తారు. ఆశ్చర్యకరంగా, ఎంపికైన పత్రాలలో కేవలం 5 శాతం మాత్రమే ఆతిథ్య విశ్వవిద్యాలయానికి చెందినవి ఉండటం ఇక్కడి విద్యా ప్రమాణాలకు, పారదర్శకతకు నిదర్శనంగా నిలిచింది.
అకడమిక్ పరిశోధనలకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడంలో ఇలాంటి సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వవిద్యాలయ ట్రస్టీ వినయ్ మహేశ్వరి పేర్కొన్నారు. సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుంటూ సమాజ ప్రగతికి తోడ్పడే పరిశోధనలను ప్రోత్సహించడమే వర్సిటీ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ సదస్సు యువ పరిశోధకులకు అంతర్జాతీయ నిపుణులతో ముఖాముఖి చర్చించే గొప్ప అవకాశాన్ని కల్పించింది.