Free Education in Private Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 12(1) (ఈ) 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.


ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్‌ 1న మొదటి విడత ఫలితాలు వెల్లడించనున్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఇందులో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


ఏపీ గిరిజన సంక్షేమ 'ప్రతిభ' గురుకులాల్లో 8వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ(ఎస్‌వోఈ/ సీవీఈ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రవేశపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 30న విడుదల చేస్తారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.. మే 5న అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలచేసి మే 20, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ప్రవేశ వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ఏపీ గిరిజన గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన బాలబాలికలు ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు స్టేట్‌ సిలబస్‌, ఆంగ్ల మాధ్యమ ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
ప్రవేశ వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..