NEET Row Bharat Bandh: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్, నెట్ పరీక్షల లీకేజీ వ్యవహారంతో విద్యార్థిలోకం అట్టుడికి పోతోంది. మరోవైపు పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏ కూటమిని టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలైన ఎస్ఐఎఫ్ (SFI), ఎఐఎస్ఎఫ్(AISF), పీడీఎస్‌యూ(PDSU), పీడీఎస్ఓ(PDSO), ఎన్ఎస్‌యూఐ(NSUI) జులై 4న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)ని రద్దు చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని ఆందోళనలు చేస్తున్నారు. 


గతచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, ఇప్పటివరకు వాటి గురించి పట్టించుకునే నాదుడే లేడని విద్యా్ర్థి సంఘాలు వాపోతున్నాయి. నీట్, యూజీసీ నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్‌లో మోడీ సమగ్ర విచారణ జరిపి, విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. నీట్, నెట్ కాదు.. కొన్నేళ్ల నుంచి అన్ని పరీక్షల పేపర్ లీకేజీలతో విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర విద్యాశాఖపై  విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షలు అనేవి విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం అని.. వారి జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నాయి.


అంతేకాక NTA వ్యవస్థను ర‌ద్దు చేయాల‌ని.. నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేసున్నారు. అంతేకాకుండా యూనివర్శిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో, రీసెర్చ్ సంస్థల్లో పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.


ప్రతి ఒక్కరూ సహకరించండి - MLC బల్మూరి వెంకట్‌
నీట్‌ పేపర్‌ లీకేజీకి నిరసనగా జూన్ 4న విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు.. అందుకూ ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్లీ బల్మూరి వెంకట్‌ పిలుపునిచ్చారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. పేపర్ లీకేజీపైన కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌పైన బాధ్యత ఉందని తెలిపారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి నీట్‌ పరీక్షను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. కాగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాలను స్వాగతిస్తున్నాం అన్నా ఆయన వాటిని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. మిగతా పరీక్షలపై కూడా అనుమానం కలుగుతుందని చెప్పారు.


నిందితులకు కఠిన శిక్ష తప్పదు - ప్రధాని మోదీ
నీట్‌ యూజీ ప్రశ్నపత్రం లీకేజీపై పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసనలు, దేశవ్యాప్తంగా విద్యార్థలు నిరసనల నేపథ్యంలో.. ప్రధాని మోదీ లోక్‌సభలో మొదటిసారి పెదవి విప్పారు. పేపర్ లీక్ విషయాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పార్లెమెంటుకు తెలిపారు. లీకేజీ ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతోందని, లక్షలాది మంది విద్యార్ధుల కష్టాన్ని వృథా కానివ్వమని మోదీ హామీ ఇచ్చారు. దేశంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు. పోటీపరీక్షల క్వశ్చ్ పేపర్లను లీక్‌ చేసే వారిని అస్సలు వదిలిపెట్టబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. యువత భవిష్యత్‌ను ఆడుకునేవారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చట్టాన్ని రూపొందించిందని ప్రధాని మోదీ చెప్పారు.


26 పిటిషన్లపై జులై 8న విచారణ..
నీట్-యూజీ 2024 పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగుతున్నాయి. నీట్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 26 పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జులై 8న విచారణ చేపట్టనుంది. నీట్ యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని జూన్ 11న సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. పరీక్ష పవిత్రత దెబ్బతిందని వ్యాఖ్యానించింది. అయితే, కౌన్సెలింగ్‌ను నిలిపివేసేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను ఆదేశించింది. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలతో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.