అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ (POLYCET)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం (మే 5న) ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం మొత్తం 1,77,581 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 1,63,008 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,48,950 మంది ఉత్తీర్ణత సాధించి పాలిసెట్ కాలేజీలలో ప్రవేశాలకు అర్హత పొందారు. ఏపీ పాలిసెట్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే మెరుగైన ప్రదర్శన కనబరిచారు. పాలిసెట్ పరీక్ష రాసిన బాలికల్లో 93.57 శాతం మంది అర్హత సాధించగా, బాలురలో 89.88 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే, అల్లూరి సీతారామరాజు జిల్లా 99.11 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పోలవరం 95.46 శాతంతో, పార్వతీపురం మన్యం జిల్లా 93.45 శాతంతో నిలిచాయి.
విద్యార్థులకు హెచ్చరిక: డిప్లొమా పరీక్షలలో పాస్ చేయిస్తామంటూ వచ్చే మోసపూరిత కాల్స్ లేదా మెసేజ్లకు స్పందించవద్దు.
