AP Engineering Colleges Fee 2024-25: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ఫీజులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంజినీరింగ్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 220 ఇంజినీరింగ్‌ కాలేజీలు, రెండు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ ఆదివారం (జులై 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల స్థాయిని బట్టి ఫీజు ఇంజినీరింగ్‌ కోర్సులకు అత్యధిక ఫీజు రూ.1.03 - రూ.1.05 లక్షలు ఉండగా, కనీస ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల ఫీజు ఉన్న కళాశాలలు 114 ఉన్నాయి. లక్షకుపైగా ఫీజు ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. ఇక రెండు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫీజులను రూ.35 వేలుగా ఖరారుచేశారు. కాగా ఈ ఫీజుల నిర్ధారణ కేవలం 2024-25 ఏడాదికి మాత్రమే వర్తించనున్నాయి. పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పునకు లోబడి ఫీజులు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ పేర్కొన్నారు. 


ఈ కళాశాలల్లోనే అత్యధికం..
ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజుల్లో లక్షకుపైగా ఫీజులున్నవి ఎనిమిదికాగా.. అందులో ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ (గుంటూరు), గాయత్రీ విద్యాపరిషత్‌ విద్యాసంస్థలు (విశాఖపట్నం),  ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ (విజయవాడ), వీఆర్‌ సిద్దార్థ (విజయవాడ), ఎస్‌ఆర్‌కేఆర్ (భీమవరం), శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్‌ (భీమవరం) కళాశాలలకు రూ.1.05 లక్షల చొప్పున, విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (భీమవరం) కళాశాలకు రూ.1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖపట్నంలోని జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ.93,700గా ఫీజులను నిర్ణయించారు. 


ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవు.. 
ఇంజినీరింగ్ కళాశాలలు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజులు, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. అయితే వసతి, ట్రాన్స్‌పోర్ట్, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్‌ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్ల పేరిట ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. 


ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం..
ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 7తో ముగిసింది. కాగా జులై 8న వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 12 వరకు ఇది కొనసాగనుంది. ఇక వెబ్‌ఆప్షన్లు మార్చుకునేందుకు జులై 13న అవకాశం కల్పించనున్నారు. అనంతరం జులై 16న అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 17 నుంచి 22 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
Counselling Website


ఈ ఏడాది మే 16 నుంచి 23 వరకు ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జేఎన్‌టీయూ- కాకినాడ పరీక్ష నిర్వహించింది.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. జూన్ 11న ఏపీ ఎప్‌సెట్ ఫలితాలను వెల్లడించారు. మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది.  ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.





మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..