AP EAMCET Counselling 2025 Seat Allotment: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్ మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు ఫలితాలు విడదలయ్యాయి. 23 జులై 2025న ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యాశాఖ కమిషన్ అధికారులు ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet-sche.aptonline.in/లో పెట్టారు. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూడవచ్చు. 

అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet-sche.aptonline.in/లోకి వెళ్లిన తర్వాత అలాట్‌మెంట్‌ లింక్‌పై క్లిక్ చేయాలి. డౌన్‌లోడ్‌ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. నేరుగా లాగిన్ అవ్వాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్‌ పుట్టిన తేదీ వివరాలు ఇచ్చిన లాగిన్ అయితే వారికి వచ్చిన కోర్సు కాలేజీ పేర్లు తెలుస్తాయి. 

ఆంధ్రప్రదేశ్‌ EAMCET కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 7న ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్లు అధికారులు స్టార్ట్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జులై 16వరకు కొనసాగించారు. తర్వాత సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడానికి జులై 17 వరకు ఛాన్స్‌ ఇచ్చారు. తర్వాత వెబ్‌ఆప్షన్‌లకు జులై 19 వరకు సమయం ఇచ్చారు. అలా మొదటి ఫేజ్ కౌన్సెలింగ్‌లో పాల్గొని కావాల్సిన కోర్సు, కాలేజీలో సీట్లను ఆప్షన్లుగా పెట్టిన వారికి ఇప్పుడు సీట్లు కేటాయించారు. ఇందులో చాలా మందికి అవకాశం రాకపోవచ్చు. వారి కోసం మరోసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇప్పుడు తొలి కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారు తమకు కేటాయించిన కాలేజీలో చేరాల్సి ఉంటుంది. 

కాలేజీ అలాట్మెంట్ అయిన వాళ్లు ముందుగా ఆన్‌లైన్‌లో టిక్ చేసి సబ్‌మిట్‌ చేయాల్సి ఉంటుంది. ఫీజులు కూడా చెల్లించాలి. తర్వాత నేరుగా జులై 24 నుంచి అంటే గురువారం నుంచి జులై 26 శనివారంలోపు వారు కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. నేరుగా వెళ్లి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి, ఫీజులు చెల్లించాలి. ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన అలాట్మెంట్ కాపీ కూడా ప్రింట్‌అవుట్ తీసుకొని వెళ్లాలి.  

అయితే కొందరికి ఒకటి కంటే ఎక్కువ కాలేజీల్లో కూడా సీట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు చాలా కాలేజీలకు చాలా కోర్సులకు ప్రయార్టీ ఇచ్చి ఉంటారు. అలాంటి విద్యార్థులు ఏం చేయాలంటే... 

ముందుగా AP EAMCET వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అలాట్‌మెంట్ ఆర్డర్‌ డౌన్‌లోడ్ పై క్లిక్ చేయాలి. ఫేజ్‌ 1సీట్ అలాట్మెంట్‌ ఆర్డర్‌లో మీకు కాలేజీ వారిగా కోర్సులు వారీగా లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీరు ఒకదానిపై క్లిక్ చేసి సబ్‌మిట్ కొట్టాలి. అక్కడ ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో మీరు ఆ కాలేజీకి ఓకే చెప్పినట్టు అర్థం తర్వాత శనివారం లోపు కాలేజీకి వెళ్లి మీరు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజులు రిసీట్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ రెండింటిలో ఏది మర్చిపోయినా సరే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. ఆ సీటును తర్వాత కౌన్సెలింగ్‌కు క్యారీఫార్వర్డ్ చేస్తారు. ఈ విషయంలో మాత్రం విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్

AP EAMCET 2025కు హాజరైనప్పటి అడ్మిట్‌ కార్డు 

ఇంటర్‌ పాస్ మార్క్ మెమో 

పదోతరగతి సర్టిఫికెట్‌ 

టీసీ 

ఆరు నుంచి 12వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లు

కుల ధ్రువీకరణ పత్రం(మీకు కేటగిరి అప్లై అయితే)

మీ తండ్రి ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా తెల్ల రేషన్ కార్డు(మీకు ఫీజులు రాయితీకి అర్హత ఉంటే)

లోకల్‌ కాకుంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ పెట్టాల్సి ఉంటుంది. 

సీటు రాకపోయిన వాళ్లు ఏం చేయాలి?

మొదటి ఫేజ్‌ AP EAMCET కౌన్సెలింగ్‌లో అందరికీ సీట్లు రాకపోవచ్చు. వాళ్లందా నిరాశన చెందాల్సిన పని లేదు. వారికి త్వరలోనే మరో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌లో కావాల్సిన కాలేజీలోనో, కోర్సులోనో సీటు రాకుంటే కూడా వారికి మరో దఫా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.