edX agreement: ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించాయి. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం (ఫిబ్రవరి 16) 'ఎడెక్స్‌' ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. 


ఎడెక్స్ ప్రోగ్రామ్ ద్వారా 2 వేల ఆన్‌లైన్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే విద్యార్థులు అత్యున్నత కోర్సులు నేర్చుకోవచ్చు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూ­ల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ప్రోత్సహిస్తోంది. ఈ కోర్సులకు ఫీజులను సైతం ప్రభుత్వమే భరించనుంది.


ఉచితంగానే కోర్సులు..
ఎడెక్స్‌ ప్రపంచంలోనే ప్రముఖ ఈ–లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్‌గా పేరొందింది. ఇందులో 180కిపైగా వరల్డ్‌క్లాస్‌ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని 2 వేలకు పైగా వర్టికల్స్‌ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మందికిపైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తోంది. దీనికోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్లకు పైగా వెచ్చించనుంది. రాష్ట్రంలోని సాంప్రదాయ వర్సిటీలతో పాటు సాంకేతిక విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ లాంటి 20 విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులకు ఎడెక్స్‌ కోర్సులను అందిస్తారు. ఆయా కళాశాలలు, వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఎడెక్స్‌ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్‌మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్‌ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్‌ రూపొందించిన ప్రశ్నాపత్రంతో వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేయవచ్చు. వాటిని వాల్యూ యాడెడ్‌ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్‌ ఇస్తారు.


ఎడెక్స్‌ కోర్సు ఇలా..
➥ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు తప్పనిసరిగా ఎడెక్స్‌ కోర్సులు అభ్యసించేలా కరిక్యులమ్‌లో భాగం చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిలో 2, 4వ సెమిస్టర్, ఇంజినీరింగ్‌లో 2, 4వ, 6వ సెమిస్టర్‌లలో ప్రతి విద్యార్థి వర్సిటీ/కళాశాల ఎంపిక చేసిన ఎడెక్స్‌ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఎడెక్స్‌ అందించే అంతర్జాతీయ కోర్సులను అభ్యసించేందుకు అవకాశం ఉంది. తద్వారా వారు నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు మరింత అర్థవంతంగా బోధించేందుకు వీలుంటుంది. విద్యార్థులు ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సును తమకు అనువైన సమయంలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. వారానికి నాలుగు గంటల పాటు క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థి ప్రత్యేక లాగిన్‌ ద్వారా మొబైల్‌ యాప్‌లో క్లాసులకు హాజరు కావచ్చు. సందేహాలను నివృత్తి చేసేందుకు ఆన్‌లైన్‌ సపోర్టింగ్‌ సిస్టమ్‌లో మెంటార్లు ఉంటారు. తద్వారా విద్యార్థులు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాలు పెరుగుతాయి.


➥ ఎడెక్స్‌తో రెగ్యులర్‌ కోర్సులు కాకుండా మార్కెట్‌ ఓరియంటెడ్‌ విద్య లభిస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్, ఫైథాన్‌ లాంటివి ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోవలో ఉన్నాయి. వీటిని నేర్చు­కోవాలంటే బోధనా విధానంతో పాటు అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మెరుగుపరచాలి. అత్యున్నత విశ్వవిద్యాల­యాలు/సంస్థలకు చెందిన అధ్యాపకులతో మన విద్యార్థు­లకు బోధించేలా ఎడెక్స్‌ దోహదం చేస్తుంది. తద్వారా విద్యా­ర్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. ప్రొ­ఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను గుర్తించి స్కిల్‌ ఓరియంటెడ్‌ కోర్సులను అందించడం ద్వారా నైపు­ణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి.