Young Man Murdered Woman In Eluru: ఓ యువకుడు తాను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా సంత్రపాడులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు (Eluru) నగరంలోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన యువతి (22) స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పని చేస్తోంది. గురువారం నగరంలోని సత్రంపాడు సాయిబాబా గుడి వద్ద తొట్టిబోయిన యేసురత్నం (23) అనే యువకుడు యువతిపై విచక్షణా రహితంగా పలుమార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతోనే యువకుడు ఇలా చేసినట్లు తెలుస్తోంది.


యువకుడు పలుమార్లు తమ ఇంటికి వచ్చి తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని అడిగాడని యువతి తల్లిదండ్రులు తెలిపారు. అయితే, తాము పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష గట్టి ఇలా దారుణంగా తమ అమ్మాయిని చంపేశాడని కన్నీరుమున్నీరుగా విలపించారు. మా అమ్మాయి జోలికి రాకుండా యువకుడి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు వెల్లడించారు. కాగా, యువతి, యువకుడు ప్రేమించుకున్నారని.. వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే మరో వాదనా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే యువతి గొంతు కోసిన యువకుడు అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. పోలీసుల విచారణలోనే అసలు నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.  ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. 


Also Read: Hyderabad News: హృదయ విదారకం - పాల ప్యాకెట్ కోసం చిన్నారితో కలిసి వెళ్లిన తండ్రి, చివరకు రోడ్డు ప్రమాదంలో