Yanam Crime : కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తాళ్లరేవు మండలం  ఇంజరం గ్రామానికి చెందిన సంగాడి రాంబాబు, యానాం కురసాంపేటకు చెందిన  కొల్లాటి రాంబాబు ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ మత్స్యకారులు కావడంతో చేపలను టోకుగా కొని మార్కెట్లో చిల్లరగా అమ్ముకుని జీవనం‌ సాగిస్తున్నారు. సంగాడి రాంబాబు తరచుగా తన స్నేహితుడు కొల్లాటి రాంబాబు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో కొల్లాటి రాంబాబు భార్య దేవితో సంగాడి రాంబాబుకు చనువు పెరిగింది. తన భార్య దేవి సంగాడి రాంబాబుతో చనువుగా మెలగడం ఆమె భర్త కొల్లాటి రాంబాబు సహించలేకపోయాడు. ఆదివారం తాను చేపలను అమ్ముకొని ఇంటికి వచ్చిన సమయంలో సంగాడి రాంబాబు తన‌ ఇంటి నుంచి రావడం చూసి ఆగ్రహావేశాలతో చేపలను కోసే కత్తితో సంగాడి రాంబాబుపై దాడి చేయడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోగా అతను మృతిచెందాడు. సంగాడి రాంబాబుపై దాడిచేసిన కొల్లాటి రాంబాబు నేరుగా యానాం పోలీసుస్టేషనుకు వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యానాం పోలీసులు తెలియచేశారు. 


భర్తను హత్య చేసి భార్య హైడ్రామా


మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంది. భర్తే దైవంగా భావించాల్సిన భార్య అతని పాలిట మృత్యువైంది. సినీఫక్కీలో కట్టుకున్న భర్తనే మట్టుబెట్టింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. మరో ముగ్గురు సాయంతో భర్తను చంపి పూడ్చి పెట్టేసింది. పైగా తన భర్త అదృశ్యం అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యే భర్తను హత్య చేసినట్లు బయట పడింది.  


భర్త అదృశ్యం అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు..


కేసును చేధించిన ఆర్మూర్ ఏసీపీ ప్రభారర్ రావు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన బట్టు జమున, రంజిత్ కుమార్ భార్యా భర్తలు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన తన భర్త అదృశ్యం అయ్యాడంటూ భార్య బట్టు జమున పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా..  అసలు దోషి భార్య జామున అని తేలింది. జమున గొల్ల నగేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరికి భర్త రంజిత్ కుమార్ అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం భర్తను హత్య చేసింది. ఈ హత్యలో గొల్ల నగేష్ తో పాటు జమున తండ్రి బైండ్ల గంగారాం, జమున పెద్ద కొడుకు కూడా చేయి వేశారు. అయితే తండ్రిని చంపేందుకు కుమారుడు, మామ  ఒప్పుకోవడం గమనార్హం. భర్త వేధిస్తున్నాడంటూ జమున చెప్పిన మాటలు విన్న వాళ్లు రంజిత్ ను చంపేందుకు ఆమెతో చేయి కలిపారు. మొత్తం నలుగురు కలిసి మద్యం మత్తులో ఉన్న రంజిత్ కుమార్ ను పొలంలో కర్రలతో గట్టిగా తలపై బాదారు. అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత అక్కడే ఉన్న మామిడి చెట్టు వద్ద గోతి తవ్వి పూడ్చేశారని నిందితురాలు జమున విచారణలో ఒప్పుకున్నట్లు ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు.