Paraglide Crash: చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ సంస్థ పారాగ్లైడ్​ లోయలో కుప్పకూలి ఓ మహిళతోపాటు ఇన్​స్ట్రక్టర్​ మృతిచెందారు. ఈ ఘటన నార్త్​ గోవాలో శనివారం జరిగింది. పీటీఐ రిపోర్ట్​ ప్రకారం.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన శివాని డబ్లే (27) పారాగ్లైడింగ్​ చేయాలనుకుంది. నార్త్​ గోవాలో చట్టవిరుద్ధంగా ఓ పారాగ్లైడింగ్​ నిర్వహిస్తున్న ఓ అడ్వెంచర్​ సంస్థను సంప్రదించింది. దీంతో వారు ఆ మహిళకు నేపాల్​కు చెందిన ఇన్​స్ట్రక్టర్​ సుమన్​ నేపాలి (26)తో పారాగ్లైడింగ్​ చేయించారు. 

కేబుల్​ తెగిపోవడంతో..!ఆ ఇద్దరు కలిసి గ్లైడర్​​లో పైకి ఎగిరిన కొద్దిసేపటికే ఓ లోయలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శివాని, ఇన్​స్ట్రక్టర్​ స్పాట్​లోనే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. గ్లైడర్​లోని ఓ కేబుల్​ తెగిపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నట్లు ఓ పోలీస్​ అధికారి వెల్లడించారు.

యజమానిపై హత్య కేసు నమోదుమృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాంద్రెమ్​ పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధంగా పారాగ్లైడింగ్ నిర్వహిస్తున్న అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ యజమానిపై సెక్షన్ 105 కింద నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పటిష్ఠ చర్యలు తీసుకోకుండానే పారాగ్లైడింగ్​ చేయిస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ యజమాని శేఖర్ రైజాదాకు పూర్తిగా తెలుసన్నారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే పారాగ్లైడింగ్​ చేయిస్తున్నారని పేర్కొన్నారు.