Warangal Fake Documents case: వరంగల్: రెవెన్యూ విభాగంలో పనిచేసిన అనుభవంతో సులువుగా డబ్బు సంపాదించాలని చూసి రిటైర్డ్ వీఏఓ అడ్డంగా దొరికిపోయాడు. అతడితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. నకిలీ రెవెన్యూ పత్రాలను సృష్టిస్తున్న మాజీ వి.ఏ.ఓ వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన మద్ది వెంకటరెడ్డి (70) తో పాటు కల్వచర్ల రఘు (50)ను టాస్క్ఫోర్స్, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు నకిలీ పట్టాదారు పాస్ బుక్‌లు, ఆర్టీఓకు సంబంధించిన సకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్,130, సి ఫారాలు, ఎమ్మార్వో, ఆర్టీవో అధికారులకు సంబంధించిన నకిలీ ముద్రణలు, పహానీలు, కొటేషన్లు, బ్యాంకు చలాన్లు (Bank Challans) , గ్రామ నక్షాలు, స్టాంపు పేపర్లను పోలీసులు రిటైర్డ్ వి.ఏ.ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు.


వివరాలు వెల్లడించిన అదనపు డీసీపీ
ఈ అరెస్ట్ కు సంబంధించి అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరాలను వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన మద్ది వెంకటరెడ్డి 1973 సంవత్సరం నుంచి 2012 వరకు రెవెన్యూ విభాగంలో పట్వారీ, పంచాయితీ కార్యదర్శి, విఏఓ నెక్కోండ, పర్వతగిరి మండలాల్లో పనిచేసి పదవీ విరమణ పొందాడు. కాని నిందితుడికి పదవీ విరమణ అనంతరం ఈజీ మనీ ఆలోచన తట్టింది. సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. తాను రెవెన్యూ విభాగంలో సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో నకిలీ సకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆర్టీఓకు సంబంధించిన నకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్,13జి, సి ఫారాలు తయారీ మొదలుపెట్టాడు. ఈ విధంగా తయారు చేసిన నకిలీ పాస్ బుక్ లు పత్రాలపై మరో నిందితుడైన కల్వచర్ల రఘుతో ఎమ్మార్వో, ఆర్టీఓ సంతాకలను ఫోర్జరీ సంతకాలు చేసేవాడు. ఇలా సృషించిన నకిలీ రెవెన్యూ పత్రాలు అవసరమున్న వ్యక్తులకు అందజేసి నిందితులు సొమ్ము చేసుకుంటున్నారు.


నకిలీ పత్రాలతో బ్యాంక్ రుణాలు
ఈ విధంగా నకిలీ రెవెన్యూ పట్టదారు పాస్ బుక్‌లు, పత్రాలను పొందిన వ్యక్తులు బ్యాంకుల నుంచి రుణం పోందేవారు. ఈ వ్యవహరంపై అధికారులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుల పాల్పడిన నేరాన్ని అంగీకరించారు. ఈ ఇద్దరు నిందితులపై నెక్కోండ, పర్వతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.


నిందితులను పట్టుకున్న సిబ్బందికి అభినందనలు 
నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు సరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లవణ కుమార్, నెక్కొండ, పర్వతగిరి ఎస్ఐలు ఫర్వీన్, దేవేందర్ తో పాటు టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుల్ నాగరాజు, సృజన్, సురేష్, శ్యాం, శ్రీను, శ్రవణ్, నవీన్ ను అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.


Also Read: Tirupati News : మూడు నెలల చిన్నారిని నేలకేసి కొట్టిన కసాయి తండ్రి, మద్యం మత్తులో దారుణం!