Warangal Kidnap : వరంగల్ లో  బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర నగర్ లోని 4వ తరగతి చదువుతున్న ముతుల్ అనే బాలిక కొబ్బరి నూనె తెచ్చేందుకు కిరాణా షాపు వెళ్లగా, అక్కడ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కర్చీఫ్ లో మత్తుమందు పెట్టి బాలికను కిడ్నాప్ చేశారు. బాలికను ఓ వ్యాన్లో తీసుకెళ్తున్న క్రమంలో వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కళాశాల వద్ద దుండగులు వ్యాన్ ఆపి టీ తాగుతుండగా, బాలికకు స్పృహ రావడంతో వాళ్ల చెర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. టాటా ఏస్ లో వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై  బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  


"దుకాణానికి వెళ్లిన చిన్నారిని ముగ్గురు వ్యాన్ లో వచ్చి కిడ్నాప్ చేశారు. ఛాయ్ తాగేందుకు ఆగినప్పుడు బాలికకు మెళకువ వచ్చింది. చిన్నారి వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతుండగా పట్టుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ఆమె వెంటబడ్డారు. అయితే అక్కడున్న వాళ్లు ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి చెప్పడంతో ఆ ముగ్గురు అక్కడ నుంచి పారిపోయారు. ముఖానికి కర్ఛీఫ్ తో ముగ్గురు వచ్చారని అమ్మాయి చెబుతోంది." - చిన్నారి బంధువు


"పాప షాపునకు వెళ్లింది. అమ్మాయి రోడ్డు దాటేవరకూ అక్కడే నిలబడ్డాను.  పది నిమిషాలు అయినా ఇంకా పాప రాలేదు. మా అబ్బాయిని పంపి షాపు వద్ద అడిగితే ఎవరు రాలేదని చెప్పారు. ఈ విషయాన్ని నా భర్తకు చెప్పాను. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని అక్కడ కూడా చూశాం, కానీ అక్కడికీ వెళ్లలేదు. ఇంతలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పాప వరంగల్ లో ఉందని ఫోన్ వచ్చింది. అక్కడికి ఎలా వచ్చిందని అడిగితే ఎవరో వ్యాన్ లో తీసుకొచ్చారని బాలిక చెప్పింది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశాం. "- బాలిక తల్లి  


దొంగను పరిగెత్తించిన వృద్ధురాలు 


పట్టపగలు... అది కూడా అందరూ చూస్తుండగా... బ్యాంకులో ఉన్న ఓ వృద్ద మహిళ చేతిలో ఉన్న 50 వేల రూపాయల బ్యాగ్‌ను తీసుకొని పారిపోయాడో దొంగ. విషయం గుర్తించిన మహిళ అతడి వెంట పరుగెత్తింది. వృద్ధురాలే అయినా డబ్బు కోసం అర కిలోమీటర్ పరిగెత్తింది. చివరకు దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించింది. హైదరాబాద్ ఘట్ కేసర్ ఠాణా పరిధిలో ఓ దొంగతనం జరిగింది. ఎదులాబాద్ కు చెందిన నర్సమ్మ పొదుపు సంఘం నాయకురాలిగా వ్యవహరిస్తోంది. రోజు వారీగా సంఘంలో జమ అయ్యే సభ్యులకు చెందిన 50 వేల రూపాయలను గురువారం రోజు ఘట్ కేసర్ పట్టణంలోని యూనియన్ బ్యాంకులో జమ చేసేందుకు వచ్చింది. ఆమెను గమనిస్తూ.. ఉన్న యువకుడు చేతిలో ఉన్న నగదు తీసుకొని పారిపోయాడు. నర్సమ్మ గట్టిగా కేకలు వేస్తూ పారిపోతున్న దొంగను సుమారు అర కిలోమీటర్ వరకు వెంటాడి పట్టుకుంది. జరిగిన విషయం చెప్పడంతో స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలే అయినప్పటికీ.. అర కలోమీటర్ పరిగెత్తి పట్టుకోవడంతో నర్సమ్మను పలువురు అభినందించారు. దొంగ అదుపులో ఉన్నారని, ప్రశ్నిస్తున్నామని క్రైమ్ విభాగం సీఐ జంగయ్య తెలిపారు.