Students Missing: విశాఖపట్నంలో నిన్న సాయంత్రం అదృశ్యం అయిన నలుగురు విద్యార్థినుల కేసును పోలీసులు ఛేదించారు. పిల్లలంతా గాజువాకలో క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని వెంటనే విశాఖ తీసుకువస్తున్నట్లు వివరించారు. 


అసలేం జరిగిందంటే..?


విశాఖపట్నంలోని క్వీన్ మేరీ హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థినులు అధృశ్యం అయ్యారు. అయితో రోజూలాగే బడికి వెళ్లిన అమ్మాయిలు సాయంత్రం దాటినా ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. స్నేహితులు, తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసినా ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. దీంతో ముందుగా పాఠశాల యాజమన్యానికి విషయం తెలియజేశారు. అయితే అదృశ్యం అయింది మొత్తం నలుగురు విద్యార్థినులు అని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. వీరంతా కలిసి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కూతుళ్లు కనిపించడం లేదని.. వెంటనే వాళ్లని వెతికి పట్టుకోవాలంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


దర్యాప్తులో భాగంగా ముందుగా పోలీసులు పాఠశాలకు వెళ్లారు. వాళ్లకు అక్కడ విద్యార్థినులు రాసిన ఓ లేఖ లభ్యం అయింది. అందులో ఆ విద్యార్థులు తమ జీవితాల కోసమే మాత్రమే తాము దూరంగా వెళ్లిపోతున్నట్లు తెలిపారు. మేము ఎవరితో వెళ్లట్లేదు.. మాకోసం, మా జీవితాలు బాగయ్యేందు కోసం మాత్రమే వెళ్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఇప్పటికే అన్ని పోలీసు గ్రూపులను,  వాలంటరి గ్రూపులను అలర్ట్ చేశారు. అమ్మాయిల జాడ కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొన్నారు. వన్ టౌన్ పోలీసులు వద్ద ఉన్న సీసీ కెమెరా వీడియోలో నలుగురు విద్యార్థినులు స్వచ్ఛందంగా వెళ్ళినట్టు ఆధారాలు సైతం ఉన్నాయని స్థానిక సీఐ వెల్లడించారు.


క్వీన్ మేరీ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు చదువు ఒత్తిడి తట్టుకోలేక, సినిమాలు, యూట్యూట్‌ వీడియోలు ప్రభావంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. 




అయితే ఈ లేఖలో ఏముందంటే...?


మా కోసం వెతక్కండి. మేము మా కాళ్ల మీద నిలబడి బతకాలి అని దూరంగా వెళ్లిపోతున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మా బతుకు కోసం వెళ్తున్నాం. అలా అని మేము అబ్బాయిలతో వెళ్తున్నట్లు అని ఎక్కువగా ఊహించుకోకండి. కేవలం మేము పైకి ఎదగడానికి మాత్రమే వెళ్తున్నాం. మమ్మల్ని వెతక్కండి. ఎక్కుడున్నా సరే మీ గురించే ఆలోచిస్తాం. మేము మంచి పొజిషన్ కి వచ్చాక మేమే మీ దగ్గరకు వస్తాం. 


గాజువాకలో దొరికిన విద్యార్థినిలు...


నలుగురు విద్యార్థినుల అదృశ్యంతో రంగంలోకి దిగిన నగర కమిషనర్.. ఏడీసీపీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదు టీం లను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన టీంలు జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టగా.. గాజువాకలోని  సుధా సిల్వర్ జ్యూవెలరీ షాప్ వద్ద విద్యార్థినులను గుర్తించినట్లు తెలిపారు. వెంటనే వారిని విశాఖకు తీసుకవస్తున్నామని చెప్పారు. పిల్లలందరూ క్షేమంగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే పోలీసులు కేసును ఛేదించడం పట్ల సదరు బాలికల కుటుంబ సభ్యులతో పాటూ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.