విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పలు కేసుల్లో పట్టుబడిన వాహనాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టేషన్ వెనుక వైపు ఖాళీ స్థలంలో పార్కు చేసిన వాహనాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో 20 వరకు టూ వీలర్లు పూర్తిగా దగ్ధం కాగా.. మరో 10 టూవీలర్లు, నాలుగు ఫోర్ వీలర్ లు పాక్షికంగా దగ్ధం అయినట్లు సమాచారం. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.


ఎవరైనా నిప్పు అంటించారా, లేక అంటుకున్నాయా !
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. దాంతో డంపింగ్ యార్డులో రాజుకున్న నిప్పు రప్పలు వ్యాపించి పీఎస్ లోని వాహనాలకి అంటుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. డిసిపి - 2 ఆనందరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించిచారు. పలు కేసులలో సరైన పత్రాలు చూపించకపోవడంతో వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పార్కింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదం జరిగి మొత్తం 30 వరకు టూ వీలర్లు దగ్దం కాగా, ఫోర్ వీలర్లు సైతం నాలుగు దగ్దమైనట్లు పోలీసులు చెబుతున్నారు.  


విషాదం నింపిన కోడిపందేలు, ఇద్దరి ప్రాణాలు తీసిన కోడికత్తి 
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కోడి పందేలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.. కోడిపందేలాడితే తాట తీస్తామని హెచ్చరించిన ఖాకీలు ఖద్దరు పైరవీలకు తలగొగ్గి పందేలకు గేట్లు ఎత్తారు. దీంతో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో సందుగొందులో కోడిపందేల బరులు వందల సంఖ్యలో వెలిసిపోయి కాయ్‌ రాజా కాయ్‌ చందంగా హద్దులు మీరాయి.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనూ పలు చోట్ల కోడిపందేలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా ఇచ్చిన అనుమతుల పందేరమే ఇద్దరు ప్రాణాలు బలిగొంది. కోళ్ల కాళ్లకు కట్టే కత్తులు గుచ్చుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండల పరిధిలోని అనంతపల్లికి చెందిన పద్మరావు అనే యువకుడు కోడికత్తి తగిలి మృత్యువాత పడగా కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో గండే ప్రకాష్‌(45) కోడికత్తి తగిలిన గాయంతో మృతిచెందాడు. పాదరసం పూసిన కత్తి గాయం కావడంతోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


తూర్పు గోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన పద్మారావు ఊళ్లో జరుగుతున్న కోడి పందాల దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో బరిలో కత్తులు కట్టిన కోళ్లు పొట్లాడుకుంటూ పద్మారావు వైపు దూసుకొచ్చాయి. ఈ తరుణంలో ఒక కోడికి కట్టిన కత్తి పద్మారావు కుడి కాలు మోకాలు వెనుక భాగంలో గుచ్చుకుంది. కత్తి మొకాలు మొత్తం భాగాన్ని చీల్చుకుంటూ వెళ్లింది. దీంతో నరాలు తెగిపోయి బరి మొత్తం రక్తమోడింది. బాగా రక్తం పోయి పద్మారావు అక్కడికక్కడే కుప్పకూలాడు.


కోడిపందేలు ఆడుతుండగా మరో వ్యక్తి... 
కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంకలో పలు చోట్ల పందేల బరులు ఏర్పాటు చేసి జోరుగా కోడిపందేలు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే కోళ్లకు కత్తులు కట్టి పందేలు ఆడుతుండగా ఇదే ప్రాంతానికి చెందిన గండే ప్రకాష్‌ అనే వ్యక్తి కోడికత్తి తెగి గాయపడి మృతిచెందాడు. కత్తులు కట్టిన కోళ్లు కోట్లాడుతుండగా దగ్గరకెళ్లి చూస్తుండగా ఎగిరిన క్రమంలో కోడికాలుకు ఉన్న కత్తె ప్రకాష్‌ కాలుకు తగె గాయం అవ్వడంతో రక్తమోడుతూ మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు వివాహితుడు కాగా పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.