Vijayawada Crime : విజయవాడలో దారుణ ఘటన జరిగింది. ఓ వివాహితను రెండు రోజులుగా బంధించి లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ సెల్‌ఫోన్‌ షాపులో పనిచేస్తున్న వివాహితకు మాయమాటలు చెప్పిన రమేష్ బాబు అనే వ్యక్తి ఆమెను గదిలో నిర్బంధించి లైంగికదాడికి  పాల్పడినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసుల చెప్పిన వివరాలు ప్రకారం జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీకి చెందిన బాధితురాలికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రీనివాస మహల్‌ సమీపంలోని ఒక సెల్ ఫోన్ షాపులో వివాహిత పనిచేస్తుంది. మహిళ గత నెల 5వ తేదీన కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. 


రెండు రోజుల ఇంట్లో బంధించి


అయితే రెండు రోజుల తర్వాత వివాహిత తిరిగి రావడంతో ఎక్కడకు వెళ్లావని భర్త ప్రశ్నించగా, ఏం జరిగిందో చెప్పలేదు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని భర్త ఏంఅనలేదు. ఇటీవల ఆమె మానసికంగా  కుంగిపోతుండటంతో ఏం జరిగిందని భర్త నిలదీశాడు. తాను పనిచేసే సెల్ ఫోన్ షాపులో తనతో పాటు పనిచేసే రమేష్‌బాబు పటమటలోని ఓ ఇంట్లో రెండు రోజుల పాటు తనను బంధించి లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ భర్తకు తెలిపింది. ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు తన మెడలో తాళి కూడా కట్టాడని మహిళ తెలియజేసింది. గత నెల 7వ తేదీన తనను బంధించిన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని తప్పించుకుని వచ్చానని ఆమె భర్తకు తెలిపింది. మహిళ భర్త కరిముల్లా ఫిర్యాదు కేసు నమోదు చేసిన కొత్తపేట పోలీసులు విచారణ చేపట్టారు. 


మహిళ దారుణ హత్య


పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో నాగమణి అనే యువతిని అత్యంత దారుణంగాహత్య చేశాడు భర్త రమేష్. వేట కత్తితో ఇంట్లోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఇల్లు అంతా రక్తంతో తడిచిపోయింది. కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో కానీ.. రమేష్ మాత్రం... వివాహేతర బంధాలను పెట్టుకుందని ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని అందుకే చంపేశానని పోలీసులకు చెబుతున్నాయి.  రమేష్‌కు నాగమణితో ఇటీవలే వివాహం అయింది. బతుకుదెరువు కోసం ఇద్దరూ నడికుడిలోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరూ పెద్దగా గొడవ  పడినట్లుగా ఉండరు. కానీ హఠాత్తుగా  తెల్లవారు జామున పెద్ద ఎత్తున అరుపులు వినిపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. వచ్చి చూసేసరి వేటకత్తితో రమేష్ కనిపించారు. దీంతో జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి నాగమణి రక్తపుమడుగులో ఉంది.