Vijayawada News : విజయవాడలో గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లేడ్ బ్యాచ్ లోని రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ సాగింది. గంజాయి మత్తులో నడిరోడ్డుపై పరస్పరం దాడులకు తెగబడడంతో జనం భయంతో హడలిపోయారు. ఈ దాడిలో అఖిల్ శ్రీను అనే యువకుడు గాయపడ్డాడు. పోలీసులు గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. 


అసలేం జరిగింది? 


గురువారం రాత్రి గని అనే బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యుడికి, ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడికి మధ్య గొడవ తలెత్తింది. మద్యం మత్తులో ఉండి వీరంగం వేస్తున్న గని బ్యాచ్‌ సభ్యుడిని పట్టుకొని హరి బ్యాచ్‌ పోలీసులకు అప్పగించింది. పోలీసులకు అప్పగించారనే కక్షతో హరి బ్యాచ్‌ పై గని బ్యాచ్‌ దాడికి పాల్పడింది.  ఆంజనేయ వాగు సెంటర్‌ కొండ ప్రాంతంలో గని బ్యాచ్‌ సభ్యుడైన అఖిల్‌, మరో ఆరుగురు యువకులతో కలిసి శుక్రవారం అక్కడికి చేరుకుని బ్లేడ్లతో దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో అఖిల్‌, శ్రీను అనే ఇద్దరు యువకులకు తీవ్రగాయలయ్యాయి. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాంగ్‌ వార్‌ జరగడంతో స్థానికులు భయాందోళన చెందారు.  


చెల్లిని ప్రేమించాడని యువకుడి హత్య


మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దూలపల్లిలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యను కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అయితే ప్రేమ పేరుతో తన చెల్లిని తీసుకెళ్లిపోయాడని కోపం పెంచుకున్న ఓ అన్న తన స్నేహితులతో కలసి  యువకుడిని దారుణంగా హత్య చేశాడు. అమీర్ పేట్ ఎల్లారెడ్డి గూడకు చెందిన హరీష్(28) కుటుంబం ఆరు నెలల క్రితం సూరారం కాలనీకి మకాం మార్చారు. ఓల్డ్ సిటీ కూల్సుంపురకు చెందిన  మెత్తర్ అనే యువతిని పది రోజుల క్రితం ప్రేమ పేరుతో ఇంట్లోంచి తీసుకువచ్చిన హరీశ్ దూలపల్లిలో మకాం పెట్టాడు.  


ఐదుగురు అరెస్ట్ 


ఈ విషయం తెలుసుకున్న యువతి అన్న దీందయాల్ తన స్నేహితులతో కలిసి వచ్చి దూలపల్లిలో రెక్కి నిర్వహించాడు. బుధవారం హరీష్  ఉండే దూలపల్లి ప్రాంతంలో కాపు కాశాడు. ముందు యువతిని తన ఇంటికి పంపించేశారు. ఆ తరువాత యువతి అన్న అతని స్నేహితులతో కలిసి హరీష్ పై కత్తులతో దాడి చేశారు. ఛాతి, ముఖంపై దాడి చేసి చంపి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న 5 మందిని అదుపులోకి తీసుకున్నారు.  


అసలేం జరిగింది? 




 



మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో యువకుడి దారుణ హత్యకు కులాంతర వివాహమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హరీశ్ అనే యువకుడు కొన్ని నెలల క్రితం దూలపల్లిలో  ఇల్లు కట్టుకొని తన తల్లితో నివాసం ఉంటున్నాడు. గతంలో అతను అమీర్ పేట్ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో ఉండేవాడు. ఆ సమయంలో వేరే కులానికి చెందిన యువతిని లవ్ చేశాడు. ఈ విషయంలో యువతి తల్లిదండ్రులు హరీశ్‌ను హెచ్చరించారు.  అయితే నివాసం మార్చినప్పటికీ యువతితో ప్రేమను కొనసాగించడమే కాకుండా కొంత కాలం తర్వాత యువతిని వివాహం చేసుకున్నాడు హరీశ్. రెండు రోజుల క్రితం యువతి అన్న తన స్నేహితులతో కలిసి వచ్చి హరీశ్ పై దాడి చేశాడు. ముందు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా దూలపల్లికి చెందిన హరీశ్‌గా గుర్తించారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన కుమారుడిని యువతి కుటుంబసభ్యులు హత్య చేశారని హరీశ్ తల్లి, అక్క ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా యువతి కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. హత్య జరిగిన తర్వాత యువతిని వారి వెంట తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.