Snake Bite Murder in UP:  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో అత్యంత విస్తుగొలిపే ఒక కిరాతక క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటూ, పిల్లలకు బుద్ధులు చెప్పాల్సిన ఒక స్కూల్ యజమానురాలు, కేవలం తన కామవాంఛ కోసం కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది. స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న అతుల్ పన్వర్, దామిని దంపతుల జీవితంలోకి ఒక మూడో వ్యక్తి ప్రవేశించడంతో ఈ దారుణ ఉదంతం జరిగింది.  ఒక వైపు భార్యగా నటిస్తూనే, మరోవైపు భర్త ప్రాణాలు తీసేందుకు ఆమె వేసిన స్కెచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Continues below advertisement

అతుల్ పన్వర్ నడుపుతున్న పాఠశాలలోనే బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అనే యువకుడితో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజురోజుకూ వీరి అక్రమ సంబంధం శృతిమించడంతో, తమ ఎంజాయ్‌మెంట్‌కు భర్త అతుల్ అడ్డుగా ఉన్నాడని దామిని భావించింది. అతడిని శాశ్వతంగా ఈ లోకం నుంచి సాగనంపితేనే తామిద్దరం స్వేచ్ఛగా ఉండొచ్చని ప్రియుడు తుషార్‌తో కలిసి ఆమె ఒక భయంకరమైన హత్యాకాండకు ప్రణాళిక రచించింది. సాదాసీదాగా చంపితే పోలీసులు దొరకిపోతామని భావించిన ఈ లేడీ విలన్, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఒక వినూత్నమైన, నమ్మశక్యం కాని ప్లాన్ వేసింది.

ఈ క్రైమ్ ప్లాన్‌లో భాగంగా.. సహజ మరణంగా లేదా ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు  విషసర్పం అస్త్రాన్ని ఎంచుకున్నారు. తుషార్ తన స్నేహితులైన సోను, ఉదయ్‌ల సహాయంతో ఒక అత్యంత విషపూరితమైన నాగుపామును సంపాదించి రహస్యంగా దామినికి చేరవేశాడు. పథకం ప్రకారం ఒక రాత్రి దామిని తన భర్త అతుల్‌కు ఆహారంలో భారీగా మత్తుమందు కలిపి ఇచ్చింది. అతుల్ స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాక, దామిని అత్యంత చల్లగా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి ఆ విషసర్పాన్ని  నేరుగా భర్త పడుకున్న మంచంపై వదిలేసింది. ఆ పాము అతుల్‌ను తీవ్రంగా కాటు వేయడంతో, మత్తులోనే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Continues below advertisement

భర్త మరణించాక ఏమీ తెలియనట్లు దామిని హైడ్రామా మొదలుపెట్టింది. గదిలోకి పాము ఎలాగో వచ్చి కరిచిందని, తన భర్త చనిపోయాడంటూ బంధువుల ముందు కన్నీరుమున్నీరైంది. అయితే, ఆధునిక ఇళ్లలోకి, అదీ బెడ్‌రూమ్ మంచం పైకి అంత పెద్ద విషసర్పం అంత సులువుగా ఎలా రాగలదనే సందేహం పోలీసులకు వచ్చింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో మృతుడి శరీరంలో విషంతో పాటు మత్తుమందు ఆనవాళ్లు కూడా బయటపడటంతో పోలీసుల అనుమానం బలపడింది. రంగంలోకి దిగిన మీరట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దామిని కాల్ డేటాను, ఆ రోజు రాత్రి ఆమె కదలికలను నిశితంగా పరిశీలించగా డ్రైవర్ తుషార్‌తో ఉన్న కనెక్షన్ బయటపడింది.  

పోలీసులు తమదైన శైలిలో దామినిని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తన అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో, భర్తను వదిలించుకోవడానికే ప్రియుడితో కలిసి పాముతో కాటు వేయించి చంపినట్లు పోలీసుల ఎదుట బోరున ఏడుస్తూ ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాలు దామినితో పాటు ఆమె ప్రియుడు తుషార్, అతడికి సహకరించిన సోను, ఉదయ్‌లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ బెడ్‌రూమ్ మర్డర్ మిస్టరీ కథనం ప్రస్తుతం మీరట్‌లో సంచలనంగా మారింది.