Tragic Accident on Hyderabad ORR | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం వద్ద అతివేగంతో దూసుకొచ్చిన వెన్యూ కారు అదుపుతప్పి, రింగ్ రోడ్డు పైనుంచి ఒక్కసారిగా కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవ్వగా, అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Continues below advertisement

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్న పాప ఉన్నారు. వీరంతా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి బాచుపల్లి వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన ఐదుగురిని చికిత్స నిమిత్తం వెంటనే పటాన్‌చెరులోని ధ్రువ ఆసుపత్రికి తరలించారు.

Continues below advertisement

ఘటనా స్థలానికి చేరుకున్న పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కారు కింద పడ్డ సమయంలో సర్వీస్ రోడ్డుపై వేరే వాహనాలు ఏవీ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.