Tirupati Crime News A man kills three family members later committed suicide | తిరుపతి: కలియుగదైవం శ్రీవారి సన్నిధి తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తిరుపతిలో బుధవారం (జులై 24న) రాత్రి ఈ దారుణం జరిగింది. పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో ఓ వ్యక్తి ముగ్గురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వదినను హత్య చేసిన నిందితుడు ఆపై ఆమె ఇద్దరు పిల్లలను హతమార్చాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా నిందితుడు దారుణానికి పాల్పడి ఉండొచ్చునని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఘటనా స్థలానికి ఎస్పీ సుబ్బారాయుడు 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని మునిరెడ్డినగర్ లో విషాదం చోటుచేసుకుంది. వదిన సునీత, పిల్లలు దేవీశ్రీ, నీరజలను మరిది మోహన్ కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆపై నిందితుడు మోహన్ సూసైడ్ చేసుకున్నాడు. వదినతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యలు, ఆత్మహత్య ఘటనపై ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.


నిందితుడు మోహన్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన కేవీఎస్ లో పని చేస్తున్నాడని సమాచారం. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల మోహన్ భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. మరోవైపు అన్న కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తి గురించి గొడవకు దిగి, మాటా మాటా పెరిగి అన్న భార్యను, వారి ఇద్దరు కుమార్తెలను నిందితుడు మోహన్ హత్య చేసి ఉంటాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.