చెల్లూరు: విజయనగరం మండలం చెల్లూరు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం రాయగడ వెళ్లేందుకు సిద్ధమైన యాత్రికుల వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ను లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మరో 13 మంది గాయపడ్డారు. విజయనగరం రూరల్ ఎస్సై అశోక్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Continues below advertisement

 విశాఖ జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట, డెంకాడ మండలం బొడ్డవలస, విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన 3 కుటుంబాలకు చెందిన 16 మంది ఒక వ్యాన్‌ను అద్దెకు తీసుకుని ప్రయాణమయ్యారు. బొచ్చపేట నుంచి బయలుదేరిన వాహనంలో అయినాడ కూడలి, చెల్లూరు వద్ద మిగిలినవారు ఎక్కారు. ఆ సమయంలో చెల్లూరు దగ్గర వ్యాన్‌ను నిలిపివుంచగా, విశాఖపట్నం వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక లారీ వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రతకు బొచ్చపేటకు చెందిన మజ్జి నారాయణరావు (50), చింతపల్లి రాంబాబు (50), మరియు బి. మోహననాయుడు (8) అనే బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో మరో 13 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి కాళ్లు విరిగిపోయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు రాంబాబు, నారాయణరావు పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. వారంతా దినసరి కూలీలు కాగా, తమ సన్నిహితులతో కలిసి  కుటుంబ సమేతంగా తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం వారి జీవితాలను తారుమారు చేసింది. 

Continues below advertisement