Abdullapurmet: ఆవేశంతో కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కిరాతకంగా హతమార్చాడు. తాజాగా ఆ కిరాతకుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్‌పూర్ లో ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఏర్పుల ధన్‌రాజ్ అనే వ్యక్తి ఆవేశంతో భార్యా కొడుకులను హతమార్చాడు. భార్య లావణ్య(23)ను సీసాతో పొడిచి, గొడ్డలితో నరికి దారుణంగా చంపాడు. నెలన్నర వయస్సు ఉన్న కొడుకు క్రియాన్ష్ ను నీటి సంపులో పడేసి ఉసురు తీసుకున్నాడు. తల్లిని, తమ్ముడిని అతి కిరాతకంగా చంపుతున్న తండ్రిని చూసి భయపడి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తడంతో రెండున్నరేళ్ల కూతురు ఆద్య ప్రాణాలతో బయట పడింది.


నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్న ధన్‌రాజ్‌ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే గత నెలనే ధన్‌రాజ్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి కందుకూరు పరిధి జబ్జార్‌గూడ ప్రాంతంలోని తన సోదరి ఇంటి వద్దే ఉంటున్నాడు. కాగా.. రెండు రోజుల క్రితం అనాజ్‌పూర్ లోని తన ఇంటికి వచ్చాడు. బెయిల్ పై వచ్చిన ధన్‌రాజ్‌ తో మాట్లాడేందుకు బంధువులు, గ్రామస్థులు విముఖత చూపారు. దీంతో ధన్‌రాజ్ ఇంట్లో, బయటా ఒంటరిగా ఉంటూ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం తండ్రి బాలయ్య ఇంటి నుంచి బయటకు వెళ్లగానే.. ఇంట్లో ఒంటరిగా ఉన్న ధన్‌రాజ్.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


ధన్‌రాజ్‌ కుమార్తె ఆద్య అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాలలోని అమ్మమ్మ, తాతయ్యలతో ఉంటోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కంటుకున్న భార్యను, కన్న బిడ్డను చంపి.. బంధుమిత్రులకు దూరమై.. ఏకాకిగా మిగిలిన ధన్‌రాజ్.. తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.


కొద్ది రోజుల్లో పెళ్లి, అంతలోనే యువతి ఆత్మహత్య


తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లాలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కరీం శెట్టి జన్ని, సత్యవతి దంపతుల కుమార్తె యువనాగదుర్గ (23). ఈమెకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్ధం అయ్యింది. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఆదివారం నాగదుర్గ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే మనస్థాపంతో ఉరేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


ఇలాంటి ఘటననే ఇటీవల చౌటకూర్‌ మండల కేంద్రంలో జరిగింది. ఇంట్లో వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చౌటకూర్‌‌కు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌటకూర్ గ్రామానికి చెందిన కిష్టయ్యకు అదే గ్రామానికి చెందిన విజయను ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కూతురు రుక్మిణి జన్మించారు. అయితే విజయ భర్త కిష్టయ్య 9ఏళ్ల కిందట మరణించాడు. ఆ సమయంలో హత్నూర మండలం కొన్యాల గ్రామంలోని విజయ ఆడబిడ్డ కుమారుడు అనిల్‌కు రుక్మిణిని ఇచ్చి వివాహం జరిపించాలని చిన్న వయస్సులోనే నిర్ణయించారు.