Suvendu Adhikari Aide Murder:పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మరోసారి రక్తపాతం చోటు చేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాలతో ప్రభంజనం సృష్టించి, తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది. ఈ విజయాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్న వేళ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండి ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారికి కుడి భుజంగా పేరుగాంచిన చంద్రనాథ్‌ రథ్‌ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతా శివారు ప్రాంతమైన మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. 

Continues below advertisement

పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులు 

బుధవారం రాత్రి సుమారు పదిన్నర గంటల సమయంలో చంద్రనాథ్‌ రథ్ తన నివాసానికి మహీంద్రా స్కార్పియో వాహనంలో తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మధ్యమ్‌గ్రామ‌ పరిధిలోని దోహారియా జంక్షన్‌ వద్ద దుండగులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక కారు చంద్రనాథ్‌ కారును ముందు నుంచి అడ్డుకోగా, వెనుక నుంచి మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. 

Continues below advertisement

స్పాట్‌లోనే చంద్రనాథ్ మృతి

చంద్రనాథ్ కారులో డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉండగా, దుండగులు పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కిటికీ అద్దాల గుండా కాల్పులు జరిపారు. మొత్తం మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ దాడిలో చంద్రనాథ్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో చంద్రనాథ్‌ కారు డ్రైవర్ కూడా బుల్లెట్ గాయాలకు గురై, ప్రస్తుతం కోల్‌కతా ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 

గుండెను చీల్చిన బుల్లెట్లు

చంద్రనాథ్‌ను పరీక్షించిన వివా సిటీ ఆసుపత్రి వైద్యులు షాకింగ్ వివరాలు వెల్లడించారు. ఆయన ఛాతీ ఎడమ భాగంలో రెండు బుల్లెట్లు, పొత్తికడుపులో ఒక బుల్లెట్ దిగింది. ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌ ఆయన గుండెను పూర్తిగా చీల్చివేసి అవతలి వైపు నుంచి బయటకు వచ్చాయని, దీని వల్ల ఆయన స్పాట్‌లోనే మృతి చెందారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆయనలో స్పందన లేని డాక్టర్‌ ప్రతిమ్‌ సేన్‌గుప్తా వెల్లడించారు. 

ఇంతకీ ఎవరీ చంద్రనాథ్‌ రథ్‌

చంద్రనాథ్‌ రథ‌ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడి అనుచరుడు మాత్రమే కాదు, దేశం కోసం పని చేసిన మాజీ సైనికుడు. చంద్రనాథ్‌ రథ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత వైమానిక దళంలో పని చేశారు. రామకృష్ణ మిషన్‌లో విద్యాభ్యాసం చేసిన ఆయనపై రామకృష్ణ మిషన్ సిద్ధాంతాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక దశలో ఆయన ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్లాలని కూడా భావించారు. వైమానిక దళం నుంచి స్వచ్ఛంద పదవి విరమణ పొందిన తర్వాత కొంత కాలం కార్పొరేట్ రంగంలో పని చేశారు 2019లో సువేందు అధికారి మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో చంద్రనాథ్‌ ఆయన అధికారిక బృందంలో చేరారు. 

సువేందుకు నమ్మకస్తుడు

సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడి బీజేపీలో చేరినప్పుడు చంద్రనాథ్‌ కూడా ఆయన వెంట నడిచారు. తక్కువ కాలంలోనే సువేందుకి అత్యంత సన్నిహితుడిగా, రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై సువేందు సాధించిన విజయంలో చంద్రనాథ్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు 

ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న సువేందు అధికారి తీవ్ర ఆవేశానికి గురయ్యారు. ఇది సాధారణ హత్య కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన కోల్డ్ బ్లడెడ్‌ మర్డర్ అని అన్నారు. గత రెండు మూడు రోజులుగా దుండగులు చంద్రనాథ్ కదలికలపై నిఘా ఉంచి, రెక్కీ నిర్వహించినట్టు సువేందు ఆరోపించారు. కారులో చంద్రనాథ్ ఎక్క కూర్చుంటారో కూడా ముందే తెలుసుకుని సరిగ్గా కిటికీ అద్దాల గుండా కాల్పులు జరపడం ఇది ప్రొఫెషనల్‌ హంతకుల పనేనని ఆయన అన్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న మహా జింగ్ల రాజ్‌ ఫలితమే ఇదని ఇలాంటి గూండాలను ఏరిపారేసే పనిని బీజేపీ ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు. 

నకిలీ నెంబర్‌ ప్లేట్ లభ్యం 

పశ్చిమ బెంగాల్ డీజీపీ సిద్ధ్ నాథ్ గుప్తా ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ వాహనంపై ఉన్న నెంబర్‌ ప్లేట్ నకిలీదని తేలింది. దాన్ని ట్యాపరింగ్ చేశారని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లైవ్ రౌండ్లు, ఖాళీ తూటాలు పోరెన్సిక్‌ బృందం సేకరించింది. నాలుగు మోటార్ సైకిళ్లై వచ్చి ఉండవచ్చని, దాడి తర్వాత కారు  వదిలేసి బైక్‌్లపై పరారయ్యారని ప్రాథమిక విచారణలో తేలింది. 

హత్యపై స్పందించిన టీఎంసీ, తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.  మొత్తానికి చంద్రనాథ్ రథ్ హత్య బెంగాల్ రాజకీయాల్లో పెన సంచలనంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరక ముందే జరిగిన ఈ ఘటన, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోందో సూచిస్తోంది.