రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సూదిమందు హత్య కేసులో వివాహేతర సంబందమే కారణమని తేలింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతనిని ఎలాగైనా హత్య చేయాలనే భార్య, ప్రియుడు కలిసి ఈ హత్యకు కారణమయ్యారు. ఇందుకు సంబందించిన విషయాలను ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి వెల్లడించారు.


బోనకల్‌ మండలం వల్లబి వద్ద ఈ నెల 19న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లిప్ట్‌ అడిగి అతడికి సూదిమందు ఇచ్చి నిందితుడు పరారైన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయంలో విచారణ ప్రారంభించిన పోలీసులు సూదిమందు హత్యకు సంబందించిన కారణాలను వెలుగులోకి తెచ్చారు. చింతకాని మండలం బొప్పారం గ్రామానికిS చెందిన జమాల్‌ సాహెబ్‌ను తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో హత్య చేసేందుకు ప్లాన్‌ చేశారు.


ముందుగా హత్యకు ఇంట్లోనే ప్లాన్‌...


జమాల్‌ సాహెబ్‌ భార్య ఇమామ్‌బీ వ్యవసాయ కూలీగా పనిచేస్తుంది. ఈ క్రమంలో చింతకాని మండలం మత్కేపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ గోద మోహన్‌రావుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబందంకు దారి తీసింది. మూడేళ్లుగా సాగుతున్న వీరి వివాహేతర సంబంధానికి ఇమామ్‌బీ భర్త జమాల్‌సాహెబ్‌ అడ్డుగా వస్తున్నారని భావించారు. అందుకే ఎలాగైన అతని అడ్డు తొలగించుకోవాలని భావించి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న నర్సింశెట్టి వెంకటేశ్‌తో కలిసి హత్య చేసేందుకు పథకం రచించారు. 


వెంకటేష్‌కు సమీప బంధువైన బండి వెంకన్న సహాయంతో హత్య చేసేందుకు కావాల్సిన ఇంజక్షన్‌ను తెప్పించారు. గత కొద్ది రోజుల క్రితమే జమాల్‌సాహెబ్‌ భార్య ఇమామ్‌ బీ ఇంజిక్షన్‌ వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.


దీంతో ఎలాగైనా అతనిని అడ్డుతప్పించుకోవాలని భావించిన ఇమామ్‌ బీ, ఆమె ప్రియు మోహన్‌రావు... జమాల్‌సాహెబ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా గండ్రాయిలో ఉన్న తన పెద్దకుమార్తె ఇంటికి సోమవారం వెళుతున్నాడని తెలుసుకున్నారు. ముందుగానే బాణాపురం గ్రామం వద్దకు చేరుకున్నారు. 


అప్పటికే అనుకున్న పథకం ప్రకారం ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్న లిప్ట్‌ అడిగి కొంత దూరం వెళ్లగానే అతనికి సూది మందు ఇచ్చాడు. అధిక డోస్‌ ఉన్న సూది మందు ఇవ్వడంతో జమాల్‌సాహెబ్‌ ద్విచక్రవాహనాన్ని ఆపాడు. బండి ఆగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కొంత దూరం వెళ్లాక మోహన్‌రావుతో కలిసి మరో ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. అప్పటికే సూది మందు ప్రభావం చూపడం, జమాల్‌సాహెబ్‌ ద్విచక్ర వాహనం నడిపే పరిస్థితిలో లేకపోవడంతో అటుగా వెళుతున్న వారు గమనించి అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ జమాల్‌సాహెబ్‌ మరణించారు. ఈ సంఘటన రెండు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది.


నంబర్‌ ప్లేట్‌లేని బైక్‌ పట్టించిందా..?


ఈ కేసు విషయంలో ఖమ్మం కమిషనర్‌ విష్ణువారియర్‌ అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. కాల్‌డేటాతోపాటు సమీప గ్రామాల్లోని సీసీ పుటేజీ పరిశీలించారు. అయితే నెంబర్‌ ప్లేట్‌లేని వాహనంపై దుండగుడు పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ఆ దిశగా విచారణ ప్రారంభించారు. సమీప గ్రామాల్లో నెంబర్‌ ప్లేట్‌లేని బైక్‌ల వివరాలు తీసుకోగా మోహన్‌రావు ద్విచక్ర వాహనానికి నెంబర్‌ ప్లేట్‌ లేదని తెలిసింది. 


అయితే సంఘటన జరిగిన తర్వాత గ్రామంలోనే ఉన్న మోహన్‌రావు మరుసటి రోజు కొత్త నెంబర్‌ ప్లేట్‌ను తన ద్విచక్ర వాహనానికి పెట్టుకున్నాడు. ఈ విషయంపై విచారణ చేసేందుకు వెళ్లగా మోహన్‌రావు పరారీకి ప్రయత్నించడంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మోహన్‌రావు చెప్పిన వివరాల ప్రకారం వెంకటేశ్‌, ఆర్‌ఎంపీ వైడ్యుడు బండి వెంకన్న అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సహకరించిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.