Rapido Driver Stabbed: ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చోరీ చేస్తుండగా అడ్డుకున్నందుకు ర్యాపిడో డ్రైవర్‌ని 23 సార్లు కత్తితో పొడిచి పారిపోయారు గుర్తు తెలియని దుండగులు. ఈస్ట్ ఢిల్లీలోని మధు విహార్‌లో ఈ దాడి జరిగింది. బాధితుడి పేరు నరేంద్ర అని పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నరేంద్ర తన ఫ్రెండ్‌తో కలిసి డ్రింక్ చేస్తున్నాడు. అప్పుడే కొందరు దుండగులు వాళ్లపై దాడి చేశారు. దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. దాన్ని అడ్డుకున్న నరేంద్రపై దాడి చేసి 23 సార్లు కత్తితో పొడిచారు. బాధితుడి స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాసేపటికి అక్కడికి వచ్చి చూసే సరికి నరేంద్ర రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే హాస్పిటల్‌కి తరలించాడు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. నిందితులు బాధితుడి మొబైల్,బ్యాగ్ చోరీ చేశారు. ఏదో పని మీద రోడ్డుపై ఆగిన సమయంలోనే దాదాపు ఐదారుగురు వచ్చి దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.