రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని సినిమా సీన్ తరహాలో కొందరు నాటకీయంగా కిడ్నాప్ చేశారు. కొత్తూరు మండలం తీగాపూర్ శివారులో కరుణాకర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును మరో కారుతో కొందరు దుండగులు అడ్డగించారు. ఏం జరిగిందో వీరికి అర్థమయ్యేలోపే అడ్డగించిన కారు అద్దాలు ధ్వంసం చేసి కారు యజమాని శ్రీధర్ రెడ్డిపై దాడి చేశారు. అనంతరం అదే కారులో ప్రయాణిస్తున్న కరుణాకర్ రెడ్డిని మరో కారులో బలవంతంగా ఎక్కించి అపహరించారు నిందితులు. కొత్తూరు mpp మధుసూదన్ రెడ్డి బామ్మర్దులు పాత కక్షలు నేపథ్యంలో కిడ్నాప్ చేసినట్లు కిడ్నాపైన కరుణాకర్ రెడ్డి తల్లి స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరుణాకర్ రెడ్డి ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


కుమారుడ్ని చూసేవరకు ఇంటికి వెళ్లనంటున్న బాధితుడి తల్లి 
కుమారుడు కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ కావడంతో అతడి తల్లి ఆందోళన చెందుతున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎంపీపీ మధుసూదన్ రెడ్డి వాళ్లు నలుగురు అన్నదమ్ముళ్లు. గతంలో ఓసారి ఇంటికొచ్చి నా కొడుకును కొట్టారు. ఇప్పుడు ఆ అన్నాతమ్ముళ్లు తన కుమారుడ్ని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారని, ఏం చేస్తారోనని ఆవేదన వ్యక్తం చేసింది. తనను పరామర్శించేందుకు వస్తున్న బంధువులను చూసి కరుణాకర్ తల్లి మరింత భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడికి ఏం కావొద్దు దేవుడా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అక్కడే కూర్చున్నారు. అయితే తన కొడుకు కనిపించే వరకు అక్కడి నుంచి ఇంటికి వెళ్లేది లేదన్నారు.


కిడ్నాప్ అయిన సమయంలో కారులో ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. తనది మల్లాపూర్ అని తన మామయ్య ఊరు మల్కపల్లిలో దించి రావడానికి కారులో వెళ్లినట్లు చెప్పారు. అదే సమయంలో కరుణాకర్ నాతో వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్లాం. అక్కడికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా నలుగురు వ్యక్తులు కారును అడ్డగించారు. రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. ఎంపీపీ మధుసూదన్ తమ్ముళ్లు, బామ్మర్దులు దాడికి పాల్పడి కరుణాకర్ ను మరో కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. ఎవరికైనా విషయం చెబితే తనను కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారని చెప్పారు.


ఆస్తి కోసం తమ్ముడినే చంపిన అన్న! 
వరంగల్ జిల్లా కేంద్రంలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 40వ డివిజన్ ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందులు శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. పెద్ద వాడైన శ్రీనివాస్ మరణించారు. చిన్నవాడైన శ్రీకాంత్ కు వచ్చిన వాటా విషయంలో గొడవ పడిన అన్న శ్రీధర్, ఆ భూమి తనకే కావాలని గొడవ పడ్డాడు. ఇక్కడే ఉంటే చంపేస్తానని కూడా బెదిరించగా శ్రీకాంత్ తన తల్లితో సహా వరంగల్ నుంచి నిజామాబాద్ కు వెళ్లాడు. 2019లో అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు. శ్రీకాంత్ భార్యతో కలిసి వరంగల్ కు వచ్చి బంధువుల ఇంట్లో ఉన్నాడు. స్థలాన్ని అమ్ముకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. శనివారం కూడా ఎప్పటిలాగే ఇద్దరు కొనుగోలు దారులను వెంట తేసుకొని స్థలం వద్దకు వెళ్లగా.. వెనక నుంచి వచ్చిన శ్రీధర్ తమ్ముడు శ్రీకాంత్ ను కొట్టాడు. తర్వాత శ్రీకాంత్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తలుపు వద్ద పెద్ద బండరాయి పెట్టాడు. ఎలాగోలా తప్పించుకోగా బండరాయితో దాడిచేసి శ్రీకాంత్ ను హత్యచేశాడు.