Influencer Murder Case:  రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో రెండు వారాల క్రితం జరిగిన ఒక  హత్య కేసు  క్లైమాక్స్.. ఒక పక్కా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, వేలాది మంది ఫాలోవర్లతో పాపులర్ అయిన ఒక మహిళ.. తన ఇన్‌స్టాగ్రామ్ లవర్‌తో కలిసి కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది. నీళ్ల ట్యాంకులో శవమై తేలిన ఒక సాధారణ కూలీ మరణం వెనుక ఉన్న సోషల్ మీడియా  వివాహేతర బంధం గుట్టును బార్మర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో చేధించారు. 

Continues below advertisement

 నీళ్ల ట్యాంకులో తేలిన శవం.. మొదలైన మిస్టరీ! 

జూన్ 4వ తేదీన బార్మర్ జిల్లా నోఖ్రా-మల్పురా ఫాంటా సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న నీళ్ల ట్యాంకులో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని గరల్ గ్రామానికి చెందిన తేజారామ్ భీల్‌గా గుర్తించారు. కేవలం మూడు, నాలుగు అడుగుల నీరున్న ట్యాంకులో మృతదేహం తేలడంతో.. మొదట దీనిని అనుమానాస్పద మృతిగా భావించారు. అయితే, మృతుడి సోదరుడు మహేషారామ్ భీల్ ఫిర్యాదుతో సదర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు, అక్కడ దొరికిన కొన్ని క్లూస్ ఆధారంగా ఇది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని అర్థమైంది.

Continues below advertisement

 ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ట్యాక్సీలో పెరిగిన బంధం! 

పోలీసుల లోతైన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. మృతుడు తేజారామ్ భార్య నేతల్ దేవి   నలుగురు పిల్లల తల్లి. ఆమెకి సోషల్ మీడియాలో విపరీతమైన పిచ్చి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ దాదాపు 42,000 మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా గుమాన్ సింగ్ రాజ్‌పుత్ అనే ట్యాక్సీ డ్రైవర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తరచూ అతని ట్యాక్సీలోనే ప్రయాణాలు చేస్తూ, ఇద్దరి మధ్య పరిచయం కాస్తా బలమైన వివాహేతర బంధానికి దారితీసింది. భర్త ఇంట్లో లేని సమయంలో వీరిద్దరి వ్యవహారం యథేచ్ఛగా సాగింది.

  భర్తకు దొరికిపోయిన జంట.. రచ్చకెక్కిన కాపురం! 

తేజారామ్ జీవనోపాధి కోసం జలోర్‌లోని సుతాఖోయ్‌లో కూలీ పనులు చేస్తూ ఉండేవాడు. ఎక్కువ కాలం అతను ఊళ్లో లేకపోవడంతో నేతల్ దేవికి మరింత స్వేచ్ఛ దొరికింది. అయితే, ఇటీవల భార్య ప్రవర్తనపై తేజారామ్‌కు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. గుమాన్ సింగ్‌తో బంధాన్ని కట్ చేసుకోవాలని భర్త హెచ్చరించడంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. దీంతో నేతల్ దేవి తన నలుగురు పిల్లలను తీసుకుని భర్తను వదిలేసి బార్మర్ నగరానికి వచ్చేసింది. అయినా సరే, భార్యను ఒప్పించి ఇంటికి తీసుకెళ్లాలనే తాపత్రయంతో తేజారామ్ కూడా బార్మర్ చేరుకున్నాడు.

 బార్మర్‌లో చివరి పంచాయితీ.. దారుణ హత్య! 

బార్మర్‌లో భార్య నేతల్ దేవి, ఆమె ప్రియుడు గుమాన్ సింగ్‌లను తేజారామ్ నేరుగా కలిశాడు. ముగ్గురి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. తమ బంధానికి తేజారామ్ ఎప్పటికీ అడ్డుగా ఉంటాడని, అతడిని వదిలించుకుంటేనే తాము హ్యాపీగా ఉండగలమని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు. పక్కా స్కెచ్ ప్రకారం, తేజారామ్‌ను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు. అనంతరం సాక్ష్యాలను నాశనం చేయడానికి, అది ఆత్మహత్యగా నమ్మించడానికి.. హేమారామ్ జాట్ అనే వ్యక్తికి చెందిన ఒక పాడుబడిన వాటర్ ట్యాంకులో శవాన్ని పడేసి ఇద్దరూ అక్కడి నుండి పరారయ్యారు.

  జైలు ఊచల వెనుక ఇన్ఫ్లుయెన్సర్ 

 టెక్నికల్ ఎవిడెన్స్   ఆధారంగా నేతల్ దేవి, ఆమె ప్రియుడు గుమాన్ సింగ్‌లను పోలీసులు వెంబడించి అరెస్ట్ చేశారు.  విచారణలో నిందితులు ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. కోర్టు నేతల్ దేవిని జుడీషియల్ కస్టడీకి పంపగా, ఈ మర్డర్ ప్లాన్‌లో మరికొంతమంది పాత్రపై విచారించేందుకు ప్రియుడు గుమాన్ సింగ్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు.