తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజం 53 రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని మరణం సహజమైనది కాదని పోలీసులు తేల్చారు. ఈ సంఘటనలో ఆజం తండ్రి తన కుమారుని మృతి సహజమైనది కాదని అతనికి లభ్యమైన కొన్ని ఆధారాలను జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబును సంప్రదించి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది.


ఖననం చేసిన మృతదేహానికి పరీక్షలు..


పోక్సో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 53 రోజుల క్రితం చనిపోగా.. కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిర్వహించారు.  అయితే అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఖననం చేసిన ఆజం మృతదేహానికి పోలీసులు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ వ్యవహారంలో మొత్తం ఆజాం భార్యతో సహా మరో ఏడుగురు పాత్ర ఉందన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. 


అనుకోకుండా దొరికిన ఆధారం..


ఈ ఏడాది జూన్ 23న స్పెషల్ ప్రాసిక్యూటర్ అక్బర్ గుండె పోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు స్థానిక ముస్లిం స్మశాన వాటికలో ఖననం చేశారు. 45 రోజుల అనంతరం అనుకోకుండా దొరికిన ఆధారం వల్ల అక్బర్ తండ్రి హుస్సేన్ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును కలిశారు. తన కుమారుని మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ చేయాల్సిందిగా అభ్యర్థించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలనం కలిగించే విషయాలను గుర్తించారు. అక్బర్ ది సహజమైన మరణం కాదని, ఎవరో హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు అక్బర్ భార్య అహ్మద్ ఉన్నీషా బేగం, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. శనివారం కాకినాడలోని సాంబమూర్తి నగర్ ముస్లిం స్మశాన వాటిక లో మృతదేహానికి పోరెన్సిక్ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ఈ కేసులో మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.


పాత సెల్ ఫోనే పట్టించిందా..?


ఫోక్సో స్పెషల్ ప్రాసిక్యూటర్ అక్బర్ ఆజం స్థానికంగా మంచి పేరున్న వ్యక్తి. స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితోపాటు వైసీపీ నాయకులతో ఈయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. తన భార్య ఉనీషా బేగం సెల్ ఫోన్ పాడవడంతో  కొత్త సెల్ ఫోన్ కొనిచ్చాడు ఆజం. అయితే పాత ఫోను బాగు చేయించుకుని వాడుకోమని తన తండ్రికి ఇచ్చాడు. ఈలోపు కుమారుని మరణంతో దాన్ని పక్కన పెట్టిన ఆజాం తండ్రి.. ఇటీవల ఓ సెల్ ఫోన్ షాపులో ఇచ్చి రిపేర్ చేయించాడు. బాగు చేయించుకున్న సెల్ ఫోన్ లో సిమ్ కార్డు వేసుకుని వినియోగిస్తున్న క్రమంలో అందులో కొన్ని కాల్ రికార్డింగ్స్ బయట పడ్డాయి. ఆ రికార్డింగ్స్ విన్న ఆజం తండ్రికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. దాంట్లో అక్బర్ ఆజాంను అంతం చేయాలని జరిగిన సంభాషణలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆజాం తండ్రి.


వివాహేతర సంబంధమే అంతమొందించిందా..? 


న్యాయవాదిగా మంచి పేరున్న అక్బర్ ఆజాం తన భార్య వివాహేతర సంబంధం వల్లనే హత్యకు గురయ్యాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది సమాచారం. ఈ ఉదంతంలో అక్బర్ ఆజం భార్యతోపాటు మరో ఏడుగురిని కాల్ డేటా, వాయిస్ కాల్ రికార్డింగ్స్ ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి రాగా త్వరలోనే జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు ప్రెస్ మీట్ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.