Road Accident in Prakasam District | ప్రకాశం జిల్లాలో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తం ఆరుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఒంగోలు మండలం కొప్పోలు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు జరిగాయి.

అసలు ఏం జరిగిందంటే..ఆదివారం తెల్లవారుజామున కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ఓ లారీ కొప్పోలు వద్ద జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ బోల్తా పడినట్లు గమనించి వెనుక వచ్చిన కారు బ్రేకులు వేయడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం తప్పిందనుకున్నా రు. కానీ అంతలోనే వేగంగా దూసుకొచ్చిన మరో లారీ అదుపుతప్పి ఆ కారును ఢీకొట్టింది. దాంతో మందు లారీ, వెనకాల లారీ.. మధ్యలో కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారులో ప్రయాణిస్తున్న కౌశిక్ (14), పావని (25) అక్కడికక్కడే మృతి చెందారు. వీరు గుంటూరు జిల్లాకు చెందిన వారు కాగా, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న మరో వ్యక్తి మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఒకే చోట ఒకేసారి వరుస రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు చనిపోవడంతో తీవ్ర విషయం నెలకొంది. రెండు లారీలు, ఓ కారు రోడ్డుపై అడ్డంగా నిలిచిపోవడంతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని సహక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదాలపై విచారణ చేపట్టారు.