Old Couple Killed In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణం జరిగింది. అంబర్‌పేట్ (Amberpet) సాయిబాబా నగర్ కాలనీలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న వృద్ధ దంపతులు లింగారెడ్డి, ఊర్మిలాదేవిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వృద్ధుల తలపై బాది, గొంతు కోసి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి వచ్చిన దుండగులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. 


హత్య కేసు ఛేదించిన పోలీసులు


అటు, కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న (మంగళవారం) రాత్రి మామిడి తోటలో వృద్ధ దంపతులను దారుణంగా హతమార్చారు.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన మూగ (చింతబాయి) ఉషయ్య (70), అతని భార్య శాంతమ్మ (60).. రంగారెడ్డి జిల్లా కందుకూరు ఠాణా పరిధిలోని కొత్తగూడ సమీపంలో వారి స్వగ్రామానికి చెందిన మనోహరరావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో రెండున్నరేళ్లుగా కాపలాదారులుగా పని చేస్తున్నారు. మామిడి తోటలో ఓ పక్కన షెడ్లతో పాటు నిర్మించిన గదుల్లో వీరు నివాసం ఉంటున్నారు. వీరిని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. శాంతమ్మను మంచంపై గొంతు కోసి హత్య చేయగా.. ఉషయ్యను వారు నివాసం ఉంటోన్న వంద మీటర్ల దూరంలో మామిడి తోటలో పరుగెత్తించి మెడ భాగంపై నరికి చంపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి నిందితులను అదుపులోకి తీసుకుని. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.


నిజామాబాద్‌లో దారుణం


మరోవైపు, నిజామాబాద్‌లోనూ దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మహిళను ఆటోలో ఎక్కించుకుని అఘాయిత్యానికి ఒడిగట్టగా శనివారం ఉదయం బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న మహిళ నిజామాబాద్ చేరుకుంది. అక్కడ ఒకటో పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు డిచ్పల్లికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. బస్టాండ్ వద్ద సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


Also Read: Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం