Nizamabad News: మొన్నటి వరకూ ఇక్కడే ఉండి చదువుకుంది. ఉన్నత చదువుల కోసం నెల రోజుల క్రితం కెనడా వెళ్లింది. బాగా చదివి.. డాక్టర్ గా తిరిగిరావాలనుకున్న ఆమె కల.. కల్లలాగే మిగిలిపోయింది. గుండెపోటుతో పోయిన నెలరోజులకే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి అంది వచ్చిన బిడ్డ చనిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


నిజాబామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ) గ్రామ సర్పంచి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి, కుమార్తె పూజితా రెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. అలాగే పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాఆలలో బీడీఎస్ పూర్తి చేశారు. పీజీ చేసేందుకు జనవరి 26వ తేదీన కెనడా వెళ్లింది. సోదరుడు అరుణ్ రెడ్డి ఇంట్లో వారం ఉండి.. అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్ లో చేరింది. పది రోజుల కిందట హాస్టల్ లో ఉండగా.. ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సపొందుతూ పూజితా రెడ్డి మృతి చెందింది. 
అయితే అక్కడే ఉన్న పూజిత సోదరుడు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చాడు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కన్నుమూసిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


రెండ్రోజుల క్రితం ఖమ్మంలో ఇంటర్ విద్యార్థి మృతి


ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మరీదు రాకేష్ వయసు 18 ఏళ్లు. మధిర పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో రాకేష్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం నాడు తన ఇంటి ఆవరణలో స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ రాకేష్ ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు, కుటుంబసభ్యులు రాకేష్ ను మధిరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాకేష్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్ధారించారు. డాక్టర్ చెప్పిన విషయాన్ని రాకేష్ కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటివరకూ తమతో సరదాగా గడిపిన స్నేహితుడు ఇక లేడని తోటి విద్యార్థులు కన్నీళ్లతోనే హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్లిపోయారు. 40, 50 ఏళ్లు కాదు కదా, కనీసం 20 ఏళ్లు కూడా నిండని వారు హఠాన్మరణం చెందడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మరోవైపు దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు లాంటి సమస్యలు పది మందిలో ముగ్గురి నుంచి నలుగరిలో కనిపిస్తున్నాయి.


గుండెపోటుతో కుప్పకూలిపోయి బీటెక్ విద్యార్థి మృతి


హైదరాబాద్ నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూపోయిన ఓ విద్యార్థి నిమిషాల వ్యవధిలో కన్నుమూశాడు. మేడ్చల్ లోని సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటివరకూ తోటి విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపాడు. కానీ కాలేజీ ఆవరణలో విద్యార్థి విశాల్ ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మార్గం మధ్యలోనే ఆ విద్యార్థి మృతి చెందాడు. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న రాజస్థాన్ కి చెందిన‌‌ విద్యార్థి విశాల్ ఆకస్మిక మరణంతో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుప్పకూలిన వెంటనే విశాల్ కు సీపీఆర్ చేశారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. వరుస గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాలు నమోదు కావడం నగరవాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.