Nizamabad Crime News: ఆమెకు ఇప్పటికే మద్యం తాగే అలవాటు ఉంది. ఇది చాలదన్నట్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. తన ఆనందాల కోసం ఏమైనా చేసేది. అయితే తన సంతోషాలకు కుమారుడు అడ్డొస్తున్నాడని ఎనిమిదేళ్ల కుమారుడి గొంతునులిమి హత్య చేసింది. ఆపై కెనాల్ లో పడేసింది. మద్యం మత్తులో ఉన్న ఆమె అదే కెనాల్ వద్ద తెల్లారేదాకా కూర్చింది. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతోంది. 


అసలేం జరిగిందంటే..?


నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నాగారం సమీపంలో గల సంతోషన్ నగర్ కాలనీలో లావణ్య, భరత్ అనే దంపతులు నివాసం ఉండేవాళ్లు. అయితే వీరికి రోహిత్ అనే ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. లావణ్య మద్యానికి బానిస కావడంతో పాటు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం లావణ్య కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరింది. తన విలాసాలకు అడ్డు వస్తున్నాడని భావించిన తల్లి.. మద్యం మత్తులో రోహిత్ గొంతు నులిమి చంపేసింది. ఆపై నిజాంసాగర్ కెనాల్ లో పడేసింది. అప్పటికీ ఆమెకు మత్తు దిగకపోయేసరికి రాత్రంతా అదే కెనాల్ వద్ద ఉండిపోయింది.


అయితే లావణ్య కెనాల్ వద్ద ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. లావణ్యన ఆరా తీయగా భర్త గురించి చెప్పింది. దీంతో పోలీసులు ఆమె భర్తకు సమాచారం అందించారు. వెంటనే భరత్ పీఎస్ కు వచ్చాడు. బాబు ఏడని లావణ్యను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఈక్రమంలోనే భార్యే ఏదైనా చేసి ఉంటుందని భరత్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని వాచరణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. తన సరదాలకు అడ్డొస్తున్నాడని కుమారుడు రోహిత్ ను తానే చంపినట్లు తెలిపింది. దీంతో కెనాల్ లో వెతకగ్గా.. బాలుడి మృతదేహం లభ్యం అయింది. పోస్టుమార్టం నిమిత్తం రోహిత్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే లావణ్య ఒక్కతే బాలుడని చంపిందా, మరెవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


నిన్నటికి నిన్న భూమి కోసం పెద్దనాన్నను హత్య చేసిన కుమారుడు


సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్ధిపూర్ గ్రామానికి చెందిన చంద్రప్ప, రత్నం అన్నదమ్ములు. వీరికి తాతల నుంచి వచ్చిన వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోంది. ఈక్రమంలోనే రత్నం కుమారుడు రాకేశ్ పెద్ద నాన్నపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఆయనను అడ్డుతొలగించుకుంటే భూమి అంతా తమకే దక్కుతుందని.. ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. వెంటనే ఇందుకోసం ఓ ప్లాన్ వేశాడు. ముందుగా వెళ్లి చంద్రప్ప వచ్చే రోడ్డులో మాటు వేశాడు. మంగళవారం మధ్యాహ్నం రోజు మాదిరిగా వ్యవసాయ పొలానికి వెళ్లి చంద్రప్ప  తరిగి వస్తుండగా... బర్ధిపూర్ శివారులోని కుప్పానగర్ -ఎల్గొయి రోడ్డు మధ్యలో మాటేసి ఉన్న రత్నం కుమారుడు రాకేశ్.. కత్తితో దాడి చేశాడు. పెద్ద నాన్న అని కూడా చూడకుండా నరికి నరికి చంపాడు. ఆపై తల, మొండెం వేరు చేశాడు. 


తలను ఝరాసంగం శివారులో రోడ్డు పక్కన, మొండెంను మరోచోట విసిరేశాడు. అనంతరం నిందితుడు రాకేశ్ యే నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఝరాసంగం, హద్నూర్ ఎస్సైలు రాజేందర్ రెడ్డి, వినయ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన స్థలంలో మృతుడి మోటార్ సైకిల్, వాటర్ బాటిల్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. భూవివాదంతోనే రత్నం కుమారుడు పెద్దనాన్న చంద్రప్పను హత్య చేశాడని జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.