మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన జెల్ల సమ్మయ్య (35), జెల్ల సరిత (28) దంపతులకు 13 నెలల వయసు ఉన్న కూతురు శ్రవన్విత ఉంది. వీరంతా గ్రామంలోనే నివసిస్తూ.. వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తారు. ప్రతిరోజూ లాగే నిన్న కూడా ఈ ముగ్గురు తమ పొలంలో పని కోసం వెళ్ళారు. సాయంత్రం పూట తిరిగి వచ్చే క్రమంలో రోజు వచ్చే దారిన కాకుండా మరో దారిలో నడిచారు. అదే వారి పాలిట శాపంగా మారింది. బిడ్డను చంకన వేస్కొని పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ తీగ చూస్కోకుండా అడుగు వేసింది సరిత. అంతే ఒక్కసారిగా షాక్ కొట్టి పడిపోయింది. విషయం గుర్తించిన భర్త వీరి ప్రాణాలు కాపాడబోయాడు. కానీ సమ్మయ్య కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. 




ఎంతకీ ఇంటికి రాకపోవడంతో..


అర్ధరాత్రి అవుతున్నా వారు ఇంటికి రాకపోవడంతో... కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూశారు. సమయ్య గాయాలతో కనిపించగా... అతని భార్య సరిత, కూతురు శ్రవన్విత శరీరం సగం వరకు కాలిపోయి మృతి చెందినట్లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన సమ్మయ్యను అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సమ్మయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం తల్లీ, బిడ్డ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అదే మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకూతురినే చంపింది.. 


నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిన్నాపూర్ శివారులో దారుణం జరిగింది. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని ఓ తల్లి తన ఆరు సంవత్సరాల వయసున్న కుమార్తెను చంపింది. ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది. పోలీసులు విచారణ జరపగా, స్వయంగా నిందితురాలే నేరాన్ని ఒప్పుకున్నట్లుగా పోలీసులు వివరించారు. శవాన్ని మాక్లూర్ మండలం చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో పడేశారు. ఆ సంఘటన స్థలాన్ని  పోలీసులు పరిశీలించగా, అక్కడ ఆమె కుమార్తె శవం లభ్యం అయింది. పోలీసులు శవాన్ని పోస్టు మార్టానికి పంపించారు.


భర్తతో గొడవలు.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం!


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని భవానిపురానికి చెందిన దుర్గా భవాని తన భర్త గురునాథంతో కలిసి మేస్త్రి పనులు చేసుకోవడానికి నిజామాబాద్‌కు వచ్చింది. ఇద్దరూ కలిసి నిజామాబాద్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరికి నాగలక్ష్మి (6), గీతా మాధవి (14 నెలలు) పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా కుటుంబ పోషణ భారం కావడంతో గురునాథం ఆటోను తీసుకొని నడుపుతున్నాడు. చాలా కాలం నుంచి దుర్గ భవాని భర్తతో తరచుగా గొడవ పడుతూ ఉంది. ఈ క్రమంలో తన భర్తకు దూరంగా ఉండాలని భావించిన దుర్గా భవాని గత నెల రోజులుగా విడిపోయి దూరంగా ఉంటోంది. నిజామాబాద్ నగరంలోనే తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తుంది. అంతకుముందే ఆమెకు బాన్సువాడకు చెందిన ద్యారంగుల శ్రీను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త గురునాథానికి తన భార్య దుర్గా భవాని ఎక్కడ ఉందో తెలియలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అయితే, డబ్బుల కోసం దుర్గా భవాని తన తల్లికి ఫోన్ చేసింది. అప్పటికే గురునాథం తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో.. ఆమె తన అత్తకు ఫోన్ చేసిన విషయం పోలీసులకు చెప్పాడు. వారు ఆ ఫోన్ నెంబరు ఆధారంగా దుర్గా భవాని నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. గురునాథం భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. పిల్లల గురించి ఆరా తీయగా చిన్న పాప నిద్ర పోతోందని, పెద్ద కుమార్తె ఆరేళ్ల నాగలక్ష్మి శ్రీను అనే తన బంధువుల ఇంటి దగ్గర ఉందని నమ్మ బలికింది. దీంతో భర్త నాకు తెలియని బంధువులు ఇక్కడ ఎవరు ఉన్నారని నిలదీశాడు. దీంతో పెద్ద కూతుర్ని చంపేసినట్లుగా ఒప్పుకుంది.