Man Murdered His Wife: హైదారాబాద్ లోని కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పచ్చగా ఉన్న కాపురంలో అనమానమనే మంట పడి చిచ్చు రేగింది. చివరకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఆ భర్త. ఆపేందుకు వచ్చిన ఓ మహిళపై కూడా కత్తి దూశాడు. చేసిన నేరానికి గాను అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్లు కూడా నిండని తమ కూతుర్ని తమకు దూరం చేశాడంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.


అసలేమైందంటే...?


కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ జియాగూడలో సంతోష్, సరిత దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ టిఫిన్ సెంటర్ లో పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. అయితే సంతోష్, సరితలకు పెళ్లి జరిగి పట్టుమని పదేళ్లు కూడా కావట్లేదు. ఇన్నాళ్లూ బాగానే ఉన్న సంతోష్.. గత కొంత కాలంగా భార్య సరితను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు.


ప్రైవేట్ పార్ట్ లో కత్తితో పొడిచాడు..


అయితే ప్రతీ రోజూ వెళ్లినట్లుగానే ఈరోజు కూడా పని నిమిత్తం టిఫిన్ సెంటర్ కు వెళ్లాడు. భర్త వెళ్లిపోయిన తర్వాత సరిత ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటోంది. భర్త సంతోషన్ సడెన్ గా ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. ఆ సమయంలో సరిత బంధువు కూడా ఇంట్లోనే ఉంది.  భార్యాభర్తల మధ్య గొడవ ముదిరే సరికి గొడవ పడొద్దంటూ చెప్పింది. అంతలోనే సంతోష్ తన వద్ద ఉన్న కత్తి తీసి భార్య ప్రైవేట్ పార్ట్ లో పొడిచాడు. ఆపేందుకు సరిత బంధువు వెళ్తే... ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో సరితకు తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే చనిపోయింది.  


గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలింపు..


వీరందరి శబ్దాలు విని చుట్టు పక్కల వాళ్లు ఇంట్లోకి చేరారు. అప్పటికే సరిత రక్తపు మడుగలో పడి ఉండగా.. ఆమె బంధువు ఓ పక్కగా ఏడుస్తూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సంతోషన్ అరెస్ట్ చేశారు. సరిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ ఆమె బంధువును కూడా అదే ఆసుపత్రిలో చేర్చారు. అయితే భార్యపై అనుమానంతోనే సంతోష్ ఆమెను హత్య చేసినట్లు సరిత తల్లిదండ్రులు చెబుతున్నారు.


మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు జరుపుతున్నామని కులుసుంపుర పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక విచారణలో సంతోష్ తన భార్యపై అనుమానంతోనే ఆమెను పొడిచి చంపినట్లు తేలిందని వివరించారు.