Qnet Case: మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ క్యూనెట్‌ కేసులో సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు మంగళవారం మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా, చిన్నంపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌ ఉపేంద్ర నాథ్‌ రెడ్డిని సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉపేంద్ర నాథ్‌ రెడ్డి మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నిందితుడు బెంగళూరులో తలదాచుకున్నట్టు సీసీఎస్‌ పోలీసులకు సమాచారం అందింది. సోమవారం అక్కడకు అక్కడి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం నగరానికి తరలించి అరెస్ట్‌ చేశారు. 


2017లో తెలంగాణ ప్రభుత్వం మల్టీమార్కెటింగ్‌పై నిషేధం విధించింది. కర్ణాటకకు  చెందిన రాజేష్‌ఖన్నా, ఏపీలోని కర్నూలు జిల్లా చెన్నమ్మపల్లి గ్రామనివాసి ఉపేంద్రనాథ్‌రెడ్డి మరికొందరితో కలసి క్యూనెట్‌ పేరు మార్చి విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వ్యాపారం చేపట్టారు. మోటివేషన్ క్లాసులు నిర్వహించేవారు. సామాన్యులను మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌లో పెట్టుబడులను ఆకర్శించేవారు. ఈ క్రమంలో పెట్టుబడుల పెట్టిన వారికి నెలకు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపారు. ఈ మోసాన్ని నమ్మించేందుకు మొదట వారికి కొంత మొత్తంలో లాభాలు చూపించారు.


ప్రజలను సులువుగా నమ్మించేందుకు సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో సంస్థ పేరు మీద కార్యాలయం ఏర్పాటు చేశారు. దొరికినంతా దోచుకోవడానికి రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.50,000-1,50,000 చొప్పున రాష్ట్రంలో 163 మంది బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారు. కొద్ది కాలం లాభాలు చూపించారు. అది నమ్మి కొందరు ఏకంగా లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే కొద్ది కాలానికి అసలు, లాభాలు ఇవ్వకుండా నిర్వాహకులు ముఖం చాటేస్తూ వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు పలుమార్లు నిర్వాహకులను నిలదీశారు. అయితే వారిని నమ్మించేందుకు కొత్త సభ్యులను చేర్పిస్తే డబ్బు తిరిగి ఇస్తామంటూ మెలికపెట్టి  కొందరిని ఉద్యోగులుగా మార్చుకున్నారు.


ఈ ఏడాది మే నెలలో స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ కేసు దర్యాప్తులో విహాన్‌ మల్టీలెవల్‌ మోసాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ (క్యూనెట్‌)పై మహంకాళి పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అనంతరం అదనపు సీపీ(ఎస్‌ఐటీ) ఆదేశాల మేరకు ఈ కేసులను హైదరాబాద్‌ సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీనిపై దృష్టి సారించిన సీసీఎస్ పోలీసులు నిందితులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు


సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో వి–అంపైర్‌ పేరుతో నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో గుర్తించిన అధికారులు 15 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో రాజేష్‌ఖన్నా, ఉపేంద్రనాథ్‌రెడ్డి కీలక సూత్రధారులుగా తేలింది. ఈ కేసులో ఉప్పటి వరకు 15 మంది నిందితులను గుర్తించారు. గతంలో 8 మందిని అరెస్ట్‌ చేశారు. 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్లు సీజ్‌ చేశారు. ఉపేంద్రనాథ్‌రెడ్డి కదలికలపై నిఘా ఉంచి తాజాగా అరెస్ట్‌ చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial