Madhapur SI Vinay caught red handed by ACB:   సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అత్యంత కీలకమైన మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్  వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మంగళవారం సాయంత్రం ఒక సివిల్ వివాదానికి సంబంధించిన కేసులో బాధితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు, అతడిపై నమోదైన కేసులో సహాయం చేసేందుకు ఎస్ఐ వినయ్ రూ. 50,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు.

Continues below advertisement

పక్కా వ్యూహంతో ఏసీబీ ట్రాప్

లంచం డిమాండ్ చేసిన విషయంపై బాధితుడు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అధికారులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ బృందం, మంగళవారం మాదాపూర్ ప్రాంతంలో ఎస్ఐ వినయ్ సదరు బాధితుడి నుంచి రూ. 50 వేల నగదు తీసుకుంటుండగా మెరుపు దాడి చేసింది. ఎస్ఐ చేతులకు జరిపిన కెమికల్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో, ఆయన లంచం తీసుకున్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది. అధికారులు నగదును స్వాధీనం చేసుకుని, వినయ్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.

Continues below advertisement

స్టేషన్‌లో కలకలం - లోతైన విచారణ  ఎస్ఐ అరెస్టుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు స్టేషన్‌లో వినయ్‌కు సంబంధించిన రికార్డులను, ఆయన పర్యవేక్షిస్తున్న కేసు డైరీలను కూడా తనిఖీ చేశారు. ఈ లంచం వ్యవహారంలో స్టేషన్‌కు చెందిన ఇతర సిబ్బంది లేదా ఉన్నతాధికారుల ప్రమేయం ఏదైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఐటీ కారిడార్‌గా పేరున్న మాదాపూర్ పరిధిలో శాంతిభద్రతల రక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారే ఇలా అవినీతికి పాల్పడటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అవినీతి అధికారులకు ఏసీబీ హెచ్చరికలు

నిందితుడైన ఎస్ఐ వినయ్‌ను బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.  ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెనుకాడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీపీ అధికారులు ప్రజలకు సూచించారు. అక్రమాలకు పాల్పడే అధికారులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టబోమని, విధుల్లో నిజాయితీ లేని వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.