కర్నూలు జిల్లాలో హానీ ట్రాప్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఈ తరహా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లాలోని  ఎమ్మిగనూరు పట్టణంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మిగనూరులో నివాసం ఉంటున్న సునీల్ అనే యువకుడికి రాత్రి సమయంలో ఓ అపరిచిత నంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఎవరో అని కాల్ లిఫ్ట్ చేసిన యువకుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కాల్ ఎత్తగానే ఓ మహిళ తన బట్టలు విప్పుతూ కనిపించింది. కాల్ మాట్లాడుతూనే వెంటనే సునీల్ కాల్ కట్ చేశాడు. 


ఆ తర్వాతే బాధితుడికి వేధింపులు మొదలయ్యాయి. తిరిగి వెంటనే మహిళ సునీల్ తో మాట్లాడిన కొద్ది క్షణాలను రికార్డ్ చేసి తాను బట్టలు లేకుండా ఉన్న మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు వీడియో క్రియేట్ చేసింది. దాన్ని సునీల్ కు పంపింది. వెంటనే ఆ వీడియోను చూసిన సునీల్ ఏం చేయాలో అర్థం కాకా తలపట్టుకొని కూర్చున్నాడు. అయితే వాట్స్ అప్ లో మహిళ వెంటనే ఆ వీడియోను పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లలోని మిత్రుల లిస్టుకు పంపుతానంటూ బెదిరింపు మెసేజ్ లు చేసింది. 


తొలుత సునీల్ వాటిని పట్టించుకోకపోవడంతో అవతలి వ్యక్తి అన్నంత పని చేసింది. ఆ మహిళ మాత్రం సునీల్ కు చెందిన ఇద్దరు మిత్రులకు ఆ వీడియోను పంపింది. ఇక తన పరువు పోతుంది అని బయపడి ఏం చేయాలో అర్థం కాక ఆవేదనా చెందాడు. 


ఇది ఇలా ఉంటే సదరు సైబర్ నేరగాళ్లు మరో రూపంలో బెదిరింపులకు పాల్పడ్డారు. మరో వాట్సాప్ నంబర్ నుండి తాము సీబీఐ అధికారులమని వీడియో యూట్యూబ్ లో వచ్చింది అంటూ ఫోన్లు చేశారు. వెంటనే డబ్బులు చెల్లించి దాన్ని డిలీట్ చేయించుకో అంటూ బెదిరింపులు చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సునీల్ కర్నూలు పోలీసులను ఆశ్రయించాడు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కిలాడీ లేడీని, ఆమె వెనుకున్న సైబర్ క్రైమ్ గ్యాంగ్‌ని పట్టుకునే పనిలో పడ్డారు. హనీ ట్రాప్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అపరిచిత (Unknown) నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.


వివాహేతర సంబంధంతో హత్య


మరోవైపు, ఇటీవలే కర్నూలు జిల్లాలో ఓ వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది. తన భార్యతో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలని చెప్పినా వినకపోవడంతోనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కొద్ది వారాల క్రితం లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన ధర్మారావు కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ధర్మారావు భార్య రమణి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన రామ్‌గోపాల్‌ రావు (33)తో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భర్త ధర్మారావు ఎన్ని సార్లు మందలించినా తీరు మార్చుకోకపోవడంతో రామ్‌గోపాల్‌రావును ఎలాగైన అంతమొందించాలని ధర్మారావు నిర్ణయించుకున్నాడు.


రామ్‌గోపాల్‌రావు ఈనెల 21న పాణ్యం మండల కేంద్రానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. తిరిగి వెళ్లే క్రమంలో నంద్యాలకు చేరుకున్న రామ్‌గోపాల్‌రావును బొమ్మలసత్రం వద్ద ఉన్న రైల్వే పట్టాల వద్ద మెడను బిగించి హత్య చేసి పరారయ్యాడు. నాలుగు రోజులైనా భర్త ఇంటికి రాకపోవడంతో మృతుడి భార్య సత్తెనపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.