Kurnool Man Suicide: కర్నూలు జిల్లాలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఅతడు.. ఇక బతకలేనంటూ సూసైడన్ నోట్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అమ్మా, నాన్న, తమ్ముడు సారీ అని చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకున్నాడు. 


జిల్లాలోని ఎమ్మిగనూరు పట్టణంలోని గీతామందిర్ వెనక సాయిరాం, శకుంతలమ్మ దంపతులు అద్దెకు ఉంటున్నారు. సాయిరాం రూరల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా చేస్తుండగా.. శకుంతలమ్మ పట్టణంలోని వీవర్స్ కాలనీలోని జెడ్పీ హైస్కూల్ లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వీరికి సాయి వెంకట్, దిలీప్ ఇద్దరు కుమారులు. సాయి వెంకట్ బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. దిలీప్ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూర్ లో వెటర్నరీ కాలేజీలో చదువుతున్నాడు. 


ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య


ఇటీవల జరిగిన టెట్ పరీక్షలో సాయి వెంకట్ మంచి మార్కులు సాధించాడు. అయితే రోజూ లాగే తండ్రి డ్యూటీకి వెళ్లాడు. తల్లి బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయి వెంకట్ వంట గదిలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విధుల నుంచి తిరిగి వచ్చిన తండ్రి కుమారుడు ఫ్యానుకు వేలాడుతుండటాన్ని చూసి కుప్పకూలిపోయాడు. గట్టి గట్టిగా ఏడ్వడం ప్రారంభించాడు.


సాయిరాం ఏడుపులు కేకలు విన్న ఇరుగుపొరుగు వాళ్లంతా వచ్చి చూశారు. కుప్పకూలిపోయి ఉన్న సాయిరాం... వంటగదిలో  వేలాడుతున్న సాయివెంకట్‌ను చూసి వాళ్ల కాళ్లకింద భూమి కుంగిపోయింది. ఇంతలో తేరుకొని సాయిరాంను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సాయి వెంకట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతికి అంది వచ్చిన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  


సూసైడ్ నోట్ లో ఏం ఉందంటే..?


అమ్మ, నాన్న, నా చిట్టి తమ్మడు మీ అందరికీ నా క్షమాపణలు. ఎందుంటే మీరు ఈ లేఖను చదివే సమయానికి నేను మీతో ఉండకపోవచ్చు. కారణం నా ఆరోగ్య సమస్య. నాకు ఇక దీంతో పోరాడే ఓపిక లేదు. ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. దీంతో పోరాడుతూనే ఉన్నాను. ధైర్యం ఉన్నా ఆపని చేయకపోవడానికి కారణం మీరు. ఇంతకాలం కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు ఉపయోగ పడలేకపోతున్నాననే భావన నన్ను ఆపేస్తూ ఉండేది. ఏదో ఒక రోజు నాది అవుతుందిలే అని అనుకొనని.. ఆరోజు ఎప్పటికీ నా జీవితంలో రాదని నాకు అర్థం అయింది. ఒక పక్క జీవించాలని అని ఉన్నా అది నయం కావడానికి ఇంకెంత సమయం పడుతుందో నాకు అర్థం కావడం లేదు. అది నయం అవుతుందన్న భావన కూడా నా దరి చేరడం లేదు. ఒక పక్క ఇలా చేతికందిన కొడుకు ఏ పని చేయకుండా ఉండడాన్ని చూస్తూ మీరు బాధ పడుతుండటాన్ని నేను తట్టుకోలేను. మీకు ఏ రకంగా కూడా ఉపయోగపడలేకపోయా. నా విచిత్రమైన జీవిత అలవాట్లతో మిమ్మల్ని బాధ పెట్టలేను. పోనీ ఈ ఆరోగ్య సమస్యకు ఏదైనా చికిత్స చేస్తే నయం అవుతుందా అంటే నాకు అది జరుగుతుందని ఆశ శూన్యం. ఒకసారి హాస్పిటల్ లో చూపించాము. డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చాడు. అయినా అది ఏమాత్రం తగ్గలేదు. సారీ అమ్మా, నాన్న, తమ్ముడు.. నేను చనిపోతున్నా. - సాయి వెంకట్


నా కొడుకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.. 


అయితే తన కుమారుడు ఆత్మహత్యపై తనకు అనుమానం ఉందంటూ సాయిరాం పోలీసులకు తెలిపాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని.. అయినా సాయి వెంకట్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న అతడితో.. ఎవరో ఇలా బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటారని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.