Konaseema Crime : ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోంది ఓ మహిళ. భర్త చేసిన పనికి ఆగ్రహంతో అతడి, ప్రియురాలిని చితకబాదింది. కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ వ్యక్తి మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసి ఆమె చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కె.గంగవరం మండలం పేకేరు శివారు నల్లచెరువుపుంతలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన రాయుడు శ్రీనివాస్, కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన చీకట్ల వీరలక్ష్మిని పదేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తరచూ ఇతర ప్రాంతాలకు పనిమీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన వివాహిత బెల్లం లక్ష్మీతో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ఇరువురి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 


ఇంటికి తాళం వేసిన అత్త 


ఇటీవల శ్రీనివాస్ భార్య వీరలక్ష్మి నడకుదురులోని పుట్టింటికి వెళ్లింది. దీంతో శనివారం రాత్రి ప్రియురాలు లక్ష్మిని శ్రీనివాస్ నల్లచెరువుపుంతలో తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన కొడుకు తండ్రి బాగోతాన్ని నాయనమ్మకు చెప్పాడు. శ్రీనివాస్ తల్లి సుబ్బాయమ్మ కొడుకు ప్రియురాలితో ఉన్న సమయంలో ఆ ఇంటికి తాళం వేసింది. అనంతరం కోడలికి సమాచారం ఇచ్చింది. ఆదివారం ఉదయం పోలీసులతో నల్లచెరువుపుంతకు వచ్చిన వీరలక్ష్మి, గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో తాళం తెరిచి ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివాహేతర సంబంధంపై భర్తను నిలదీసిన ఆమె కోపంతో భర్త, ప్రియురాలిని చితకబాదింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రాయుడు శ్రీనివాస్, అతని ప్రియురాలు బెల్లం లక్ష్మీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 


ప్రియుడి మోజులో భర్తను హత్య


ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా మట్టుబెట్టిన ఓ భార్య వ్యవహారం సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకముందే భర్తను చంపేసింది. పెద్దలు బలవంతంగా ఆమెను ఒప్పించి పెళ్లి జరిపించడమే ఇందుకు కారణం అని పోలీసులు గుర్తించారు. అంతకుముందు ఉన్న ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. అందుకు రెండు ప్రయత్నాలు చేసింది. మొదటిసారి అన్నంలో విషం కలిపి పెట్టగా, అది విఫలం అయింది. రెండోసారి గొంతు పిసికి చంపింది. 


చేసిన హత్యాయత్నం విఫలం కాగా.. రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతీలో నొప్పితో చనిపోయాడని నాటక మాడింది. పోలీసుల దర్యాప్తులో హత్య విషయం వెల్లడవడంతో.. జైలు పాలైంది. పెళ్లయిన 36 రోజుల్లోనే ఇవన్నీ జరగడం గమనార్హం. పోలీసులు వెల్లడించిన వివరాలివీ.. సిద్దిపేట జిల్లాలో ఏప్రిల్ 28న ఈ హత్య జరిగింది. దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్‌ అనే 24 ఏళ్ల వ్యక్తికి తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల అనే 19 ఏళ్ల యువతితో గత మార్చి 23న పెళ్లి జరిగింది. అదే ఊరికి చెందిన శివకుమార్‌ అనే 20 ఏళ్ల వ్యక్తితో శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉంది. కానీ, పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాపురం నచ్చకపోవడంతో ప్రియుడు శివతో కలిసి హత్యకు ప్లాన్ వేసింది.