ఆమెకు అదివరకే వివాహమైంది. భర్త ఉన్నాడు.. కానీ అదే ప్రాంతంలో ఉంటోన్న మరో వ్యక్తితో మహిళ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. అతనితో ఏకంగా పదేళ్లు రహస్యంగా ఎఫైర్‌ నడిపినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కొన్ని రోజులుగా వేరే వ్యక్తులతో కూడా సన్నిహితంగా మెలుగుతోంది. అదే సమయంలో పాత ప్రియుడ్ని క్రమంగా దూరం పెట్టసాగింది. దీంతో పలుసార్లు ప్రియుడు చెప్పిచూసినా ఆమెలో ఎటువంటి మార్పు కనిపించకపోగా అతడికి ఎదురు తిరిగింది. ప్లాన్ ప్రకారం.. ఒంటరిగా రమ్మని పిలిచి, మెడకు తాడు బిగించి హత్య చేశాడు. ఎవ్వరికీ తెలియకుండా డెడ్‌బాడీని కొబ్బరితోటల్లోని బావిలో పడేశాడు.


పోలీసుల కథనం ప్రకారం..
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమజిల్లాలోని కొత్తపేట లో గత నెల 22న ఓ మోటారు బావిలో శవమై కలిపించిన వివాహిత పాము లక్ష్మి కేసును కొత్తపేట పోలీసులు పోలీసులు ఛేదించారు.  కొత్తపేట గ్రామం ఇందిరానగర్‌కు చెందిన పాము లక్ష్మికి చాలా కాలం కిందటే వివాహమైంది. ఆమె భర్త ఉన్నాడు. కానీ కొత్తపేట వాడపాలెంకు చెందిన మీసాల ఏసు అనే వ్యక్తితో వివాహేతర సంబందం కొనసాగిస్తోంది. ఇటీవల  లక్ష్మి మరికొందరు వ్యక్తులతో సైతం సన్నిహితంగా మెలుగుతోంది. ఇతర వ్యక్తులతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, వేరే మగాళ్లతో చనువుగా ఉండడాన్ని ప్రియుడు ఏసు గమనించాడు. కేవలం తనతోనే చనువుగా ఉండాలని, ఇతర వ్యక్తులతో రిలేషన్ కట్ చేసుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు ఏసు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాకపోవడంతో, తన మాట వినని ఆమెను హతమార్చాలని నిర్ణయం తీసుకున్నాడు.


గేదెల పాక వద్దకు రమ్మని పిలిచి..
హతురాలు పాము లక్ష్మితో విసుగెత్తిన మీసాల ఏసు గత నెల 15వ తేదీన తన తోటలోని గేదెల పాక వద్దకు రమ్మని పిలిచాడు. గత పదేళ్లుగా నిన్ను పోషిస్తున్నానని, అయినా నువ్వు వేరే వ్యక్తులతో ఎందుకు సంబంధం పెట్టుకున్నావని నిలదీశాడు. దానికి ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆవేశంతో ఊగిపోయిన ఏసు తన వెంట పథకం ప్రకారం తెచ్చుకున్న తాడుతో లక్ష్మి గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తరువాత తన మోటారు బావిలోకి డెడ్‌బాడీను తోసేసి ఆపై సిమెంట్‌ బల్ల వేసేశాడు. అయినప్పటికీ డెడ్‌బాడీ నుంచి వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకు రెండు, మూడు రోజుల నుంచి లక్ష్మి కనిపించకపోవడంపై మిస్సింగ్‌ కేసు నమోదు కావడంతో డెడ్‌బాడీను వెలికితీసి అనుమానస్పద కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్‌లిస్ట్‌ ద్వారా నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు సంగతి బయటపెట్డాడు. నిందితుడు మీసాల ఏసును రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ కేవీ రమణ తెలిపారు.  


వివాహేతర సంబంధాల కారణంగా ఒకరిద్దరూ మాత్రమే కాదు, వారి కారణంగా రెండుకు పైగా కుటుంబాల జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉందని పోలీసులు అన్నారు. ఇలాంటి సంబంధాలతో ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందని, సరిగ్గా మసలుకుంటే ఏ సమస్య ఉండవని, లేకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. మరికొన్ని సందర్భాలలో ప్రియురాలి భర్తను హత్య చేయడం లాంటి దారుణాలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలన్నారు.