Karimnagar Gold Heist Case: కరీంనగర్లోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న PMJ జ్యువెలరీ షోరూమ్లో మే 3న జరిగిన సాహసోపేత దోపిడీ వెనుక ఉన్న సూత్రధారిని పోలీసులు గుర్తించారు. బీహార్కు చెందిన పేరుమోసిన గ్యాంగ్స్టర్ సుబోధ్ సింగ్, ప్రస్తుతం పూర్ణియా సెంట్రల్ జైలులో ఉండి కూడా ఈ భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ గౌష్ ఆలం వెల్లడించారు. గోల్డెన్ థీఫ్ గా పేరు తెచ్చుకున్న సుబోధ్ సింగ్, దేశవ్యాప్తంగా దాదాపు 400 కిలోల బంగారాన్ని దోచుకున్న అంతర్రాష్ట్ర ముఠాకు నాయకుడు. జైలు నుంచే ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా తన అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఆపరేషన్ను పర్యవేక్షించినట్లు దర్యాప్తులో తేలింది.
తెలంగాణలో రెండు నెలల రెక్కీ
ఈ దోపిడీ ఒక్కరోజులో జరిగింది కాదు. ఈ ముఠా సభ్యులు సుమారు రెండు నెలల ముందే తెలంగాణకు చేరుకున్నారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లోని ప్రధాన జ్యువెలరీ షాపులను, బ్యాంకులను వీరు క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి కరీంనగర్లోని PMJ షోరూమ్ను లక్ష్యంగా ఎంచుకున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నకిలీ ఆధార్ కార్డులతో ధర్మపురి, పెద్దపల్లిలోని లాడ్జీల్లో బస చేస్తూ, నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను వాడారు. ఒక మెకానిక్ గ్యాంగ్ లాగా నటిస్తూ స్థానికులకు అనుమానం రాకుండా పక్కా ప్లాన్ అమలు చేశారు.
తూటాల వర్షం.. దోపిడీ
మే 3వ తేదీ ఉదయం కస్టమర్ల ముసుగులో షోరూమ్లోకి ప్రవేశించిన ఐదుగురు సాయుధ దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన నలుగురు సిబ్బందిపై కాల్పులు జరిపి, వారిని తీవ్రంగా గాయపరిచారు. నిమిషాల వ్యవధిలోనే దాదాపు 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలను బ్యాగుల్లో నింపుకుని బైకులపై పరారయ్యారు. దోచుకున్న సొత్తు విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా. కాల్పుల ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
9 రాష్ట్రాల్లో వేట.. నిందితుల అరెస్ట్
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు 9 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. సుమారు 132 మంది సిబ్బందితో కూడిన ఐదు ప్రత్యేక టీమ్స్ పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్రల్లో వేట సాగించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్యాంగ్లోని ముగ్గురు కీలక సభ్యులను రఘునాథ్ కర్మాకర్, రవిష్ కుమార్, మెహతాబ్ ఖాన్ అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి నగదు, మొబైల్ ఫోన్లు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరికొంత మంది సభ్యులు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
స్మార్ట్ ఎస్కేప్ ప్లాన్
దోపిడీ అనంతరం నిందితులు ప్రధాన రహదారులను వదిలి, గ్రామీణ ప్రాంతాల్లోని డెడ్-ఎండ్ రూట్లను ఎంచుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా పోలీసులు లేని దారుల్లో ప్రయాణించి గోదావరి నదిని దాటి పారిపోయారు. నిందితుల్లో ఒకడు దోచుకున్న నెక్లెస్తో ఉన్న ఫోటోను తన గ్యాంగ్ యాప్లో అప్లోడ్ చేయడం వారి ఓవర్ కాన్ఫిడెన్స్ను చాటుతోంది. ప్రస్తుతం జైలులో ఉన్న సుబోధ్ సింగ్ను పీటీ వారెంట్పై తెలంగాణకు తీసుకువచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసు ఛేదనతో రాష్ట్రంలో భారీ దోపిడీ ముఠాల నెట్వర్క్ను పోలీసులు దెబ్బతీశారు.
