Kamareddy Case: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల న్యూ మహారాజ లాడ్జిలో తల్లికొడుకులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన కామారెడ్డిలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మృతులు రామయంపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. సెల్ఫీ సూసైడ్ వీడియో ఆధారంగా ఏడుగురిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లీకొడుకుల ఆత్మహత్య విషయం బయటకు రాగానే, ఆరుగురు నిందితులు సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారీలో ఉన్నారని చెబుతున్నారు. 


లాడ్జీలో నిప్పంటించుకుని ఆత్మహత్య..
రామాయంపేట కేంద్రానికి చెందిన గంగం సంతోష్(35), పద్మ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ మహారాజ లాడ్జిలో రూమ్ నంబర్ 203 లో ఉన్నారు. పద్మ వైద్యం కోసం కామారెడ్డికి వచ్చిన వారిద్దరూ ఏప్రిల్ 11నుంచి లాడ్జీలోనే ఉంటున్నారు. అయితే శనివారం తెల్లవారుఝామున రూంలో నుంచి పొగలు రావడంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చూడగా తల్లికొడుకులు సజీవదహనమయ్యారు. అయితే తమ చావుకు ఆ ఏడుగురే కారణం అంటూ ఫోటోలు విడుదల చేసారు. దాంతో ఈ ఆత్మహత్య ఘటన సంచలనం రేపింది. మృతులు రిలీజ్ చేసిన ఫోటోలలో గతంలో రామయంపేట సిఐగా పనిచేసి బదిలీపై వెళ్లిన నాగార్జున గౌడ్ సహా పలువురు రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. 







మా చావుకు ఏడుగురు కారణం.. 
చనిపోకముందు సెల్ఫీ వీడియో ద్వారా ఫేస్ బుక్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. 'నా పేరు గంగు సంతోష్. మా నాన్న పేరు అంజయ్య. మా చావుకు ఆ ఏడుగురే కారణం అని రామాయం పేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ సహా ఏడుగురి పేర్లు, ఫోన్ నెంబర్ వెల్లడించారు. వారి వల్ల 18 నెలలుగా చాలా రకాలుగా నష్టపోయాం. నా తల్లిదండ్రులకు మనఃశాంతి లేకుండా చేశారు. ఆ ఏడుగురి ద్వారా మనఃశాంతి లేదు. వేధింపుల వల్ల ఆస్తులు ఆస్తి, డబ్బు నష్టపోయాను. అప్పులు కూడా చేసాను. డబ్బులు పోయినా పరవాలేదు. మళ్ళీ సంపాదించుకోగలను. నా పర్సనల్ వ్యవహారాలు రామాయంపేట సిఐ నాగార్జున గౌడ్, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ లు మెమరీ కార్డు ద్వారా సేకరించి మానసికంగా వేదించారు. వారిపై ఫిర్యాదు చేసి 110 రోజులు అవుతోంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. 


టీఆర్ఎస్ పార్టీ వారు కావడంతో న్యాయం జరగలేదని ఆరోపణ
తమను వేధించిన వారిలో రామాయం పేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, రామాయంపేట మార్కెట్ చైర్మన్ యాదగిరిలు అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఒక్క శాతం కూడా న్యాయం జరగలేదు. ఇంకా వారి వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వేధింపులు తట్టుకోలేక అమ్మా నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఫ్యామిలీకి మమ్మల్ని దూరం చేస్తున్నారు. మేము చనిపోయాక అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇక సెలవు' అంటూ సెల్ఫీ వీడియో ద్వారా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. 


వీడియో వైరల్ కావడంతో దర్యాప్తు వేగవంతం..
ప్రస్తుతం ఈ వీడియో సంచలనం రేపుతోంది. మృతులు విడుదల చేసిన ఫోటోలు రాజకీయ నాయకులకు సంబంధించినవి కావడంతో చర్చనియంశంగా మారింది. ఈ విషయమై కామారెడ్డి డిఎస్పీని వివరణ కోరగా ఉదయం తమకు లాడ్జిలో ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు సమాచారం రావడంతో ఫైర్ సిబ్బందితో మంటలు ఆర్పి మృతులు ఉన్న గదిలోకి వెళ్లి చూసేసరికి చనిపోయారన్నారు. తమకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోందని, చనిపోకముందు ఫేస్ బుక్ లో వీడియో ద్వారా మాట్లాడిన విషయాలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Also Read: Kamareddy: కామారెడ్డిలో దారుణం - లాడ్జీలో తల్లీకుమారుడు ఆత్మహత్య, సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో ! 


Also Read: Tirupati Crime : అద్దె ఇంట్లో గుట్కా డెన్, వ్యాపారిలా వెళ్లి పట్టేసినా సెబ్ అధికారులు