కాకినాడ జిల్లా... ప్రత్తిపాడు 
జల్సాలకు అలవాటు పడుతున్న ఇద్దరు వ్యక్తులు బస్‌ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇలా పలు చోట్ల సెల్‌ఫోన్లు, బైక్‌లు దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికారు. గత కొన్ని రోజులుగా  ఇద్దరు వ్యక్తులపై నిఘా పెట్టి పోలీసులు చివరకు వలపన్ని పట్టుకున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో అరెస్ట్‌ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. తుని ప్రాంతానికి చెందిన బోదల అప్పారావు అనే వక్తిని, విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు చెందిన బోదల సురేష్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. 


మొదటి కేసులో నిందితుడు అప్పారావుపై తుని పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే సస్పెక్టడ్‌ షీట్‌ కూడా ఉంది. సారా అమ్మడంతోపాటు బైక్‌, సెల్‌ఫోన్లు దొంగతనాలు చేస్తున్నాడని గుర్తించి ఇతనిపై నిఘా ఉంచామని తెలిపారు. సురేష్‌ అనే వ్యక్తి అన్నవరం పరిసర ప్రాంతాల్లో రూమ్‌ తీసుకుని రాత్రిపూట బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌ల్లో తిరుగుతూ అదేవిధంగా రైలులో నిద్రపోతున్న ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లు దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. చోరీ చేసిన సొత్తును మద్యవర్తుల ద్వారా రీ సెట్టింగ్స్‌ చేయించి విక్రయిస్తున్నారని వెల్లడిరచారు. ఈ చోరీ చేస్తున్న సెల్‌ఫోన్లును పాస్‌వర్డ్‌లను తీయడం, ఇతర సాంకేతికంగా సహకరిస్తున్నవారిని, విక్రయిస్తున్నవారిని గుర్తించామని తెలిపారు. త్వరలోనే వారిని అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.


రూ.13లక్షల 50 వేలు విలువైన సెల్‌ఫోన్లు, బైక్‌లు స్వాదీనం..
ఈ రెండు కేసుల్లో అరెస్ట్‌ అయిన ఇద్దరు నిందితుల వద్దనుంచి 54 ఖరీదైన సెల్‌ఫోన్లు, తొమ్మిది బైక్‌లు స్వాదీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడిరచారు. వీటి విలువ రూ.13.50 లక్షలు విలువ ఉంటుందని తేలిందని తెలిపారు. ప్రయాణాల్లో రైలుల్లోనూ, బస్సుల్లోనూ నిద్రపోయేటప్పడు తమ విలువైన సామాగ్రిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని పోలీసులు సూచించారు.


కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో దొంగలు రెచ్చి పోయారు. గొర్రెల కాపరిని టార్గెట్ చేసిన దొంగలు.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గొర్రెలను దొంగిలించారు. మరుసటి‌ రోజు బంధువులు వచ్చేవరకు గొర్రెల కాపరి మత్తులోనే ఉన్నాడు. చోరీ చేసిన జీవాల‌‌ విలువ సుమారు ఆరు లక్షల‌ వరకు ఉండటంతో బాధితుడు లబోదిబో అంటున్నాడు. పోలీసులు మాత్రం చోరీ జరిగిన ప్రాంతం ఏ జిల్లాలోకి వస్తుందా అనే పనిలో నిమగ్నమై ఉండటం కొసమెరుపు. 
మున్నంగి గ్రామానికి చెందిన కృష్ణరావు నాలుగు ఏళ్ల నుంచి గొర్రెలు కాపరిగా జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే గొర్రెలు మేపటానికి కృష్ణానది లంకల్లోకి వెళ్లాడు. గొర్రెలు కాస్తున్న క్రమంలో గుర్తుతెలియని నాలుగు దుండగులు వెనక నుంచి వచ్చి కృష్ణారావు ముఖానికి ముసుగువేసి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత తాళ్లు, టేప్ తో కట్టేశారు.  అక్కడ ఉన్న  50 గొర్రెలను తరలించుకుపోయారు.  కృష్ణారావుకు మత్తు ఇంజక్షన్ ఇవ్వటంతో మత్తులోకి జారుకున్నాడు. చీకటి పడ్డా కృష్ణారావు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు ఆందోళన చెందారు. స్థానికులతో కలిసి‌ వెతకగా స్పృహ కోల్పోయిన స్థితిలో కృష్ణారావు వారికి కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.  అనంతరం ఈ ఘనటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.