Indian Techie Avinash Narne Wife Murder: అమెరికాలో స్థిరపడి, ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఒక భారతీయ టెక్కీ.. అత్యంత కిరాతకమైన విలన్గా మారాడు. పెళ్లయిన నాలుగు నెలలకే కట్టుకున్న భార్యను గొంతు పిసికి దారుణంగా హత్య చేసి, ఏమీ తెలియనట్లు తొమ్మిది నెలల పాటు పోలీసులను బురిడీ కొట్టించాలని చూశాడు. కానీ, అమెరికా డిటెక్టివ్ల శాస్త్రీయ దర్యాప్తు ముందు అతని ప్లాన్ తలకిందులైంది. వాషింగ్టన్ స్టేట్ బెల్లేవు నగరంలోని వారి నివాసంలో జరిగిన 27 ఏళ్ల రాజిత సబ్బినేని అనుమానాస్పద మృతి కేసులో.. ఆమె భర్త, 30 ఏళ్ల అవినాష్ నార్నే పై కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ల కార్యాలయం జూలై 1న ఫస్ట్-డిగ్రీ మర్డర్ కింద అధికారికంగా చార్జ్ షీట్ దాఖలు చేసింది.
అక్టోబర్ 27, 2025 రాత్రి హత్య జరిగింది. ఆ రాత్రి అవినాష్ నార్నే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, తన భార్య బాత్రూమ్లోకి వెళ్లి లోపల లాక్ చేసుకుందని, ఎంత పిలిచినా బయటకు రావడం లేదని కంగారుగా రిపోర్ట్ చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాత్రూమ్ తలుపులు బద్దలు కొట్టగా.. అక్కడ రాజిత సబ్బినేని అపస్మారక స్థితిలో పడి ఉంది, ఆమె అప్పటికే మరణించినట్లు మెడికల్ టీమ్ ధృవీకరించింది. ప్రాథమికంగా ఇదొక ఆత్మహత్య లేదా ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ.. కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ల పోస్ట్మార్టం నివేదికలో రాజితది సహజ మరణం కాదని, శ్వాస ఆడకుండా గొంతు పిసికి హత్య చేశారని తేలింది. హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే భర్త అవినాష్ తనకు ఇచ్చే జ్యూస్లు, డ్రింక్స్ చాలా చేదుగా ఉంటున్నాయని రాజిత తన సందేశాలలో స్నేహితులకు ఫిర్యాదు చేసింది. చివరకు ఆమె చనిపోయిన రోజు కూడా భర్త చేసి ఇచ్చిన స్మూతీ.. మందు లాగా, కఫ్ సిరప్ లాగా ఘాటుగా ఉందని ఆమె మెసేజ్ చేయడం కలకలం రేపింది. అప్పట్లో పోలీసులకు అవినాష్ ఇచ్చిన స్టేట్మెంట్లో.. తమకు జూన్ 5, 2025న వివాహం జరిగిందని, జూలైలో అమెరికాలో కలిసి ఉండటం ప్రారంభించామని చెప్పాడు. ఘటన జరిగిన రోజు తాను కేవలం 40 నిమిషాల పాటు బయటకు పనుల మీద వెళ్లి వచ్చేసరికి ఈ షాక్ తగిలిందని నమ్మబలికాడు. అయితే, డిటెక్టివ్లు వారి అపార్ట్మెంట్లోని స్మార్ట్ లాక్ డేటా ను క్షుణ్ణంగా పరిశీలించగా.. అవినాష్ బయటకు వెళ్లిన మాట వాస్తవమే కానీ, ఆ సమయంలో ఆ ఇంట్లోకి వేరే ఏ మూడో వ్యక్తి రాలేదని డిజిటల్ సాక్ష్యాలు స్పష్టం చేశాయి. అంటే, అవినాష్ ఇల్లు వదిలి వెళ్లకముందే రాజితను ఇంట్లో హతమార్చి, ఆ తర్వాత కావాలనే బయటకు వెళ్లి సాక్ష్యం సృష్టించుకున్నాడని తేలింది.
ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ వెనుక ఉన్న అసలు మోటివ్ చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. అవినాష్కు పెళ్లికి ముందే భారతదేశంలో ఒక మహిళతో రహస్య సంబంధం ఉండేది. ఎంత దారుణమంటే.. సదరు ప్రియురాలు వీళ్ల పెళ్లికి కూడా హాజరైంది, పెళ్లయిన తర్వాత కూడా అవినాష్ ఆమెతో చాటింగ్ కంటిన్యూ చేశాడు. రాజిత చనిపోయిన రోజు కూడా అవినాష్ సదరు సీక్రెట్ లవర్కు కనీసం నాలుగు సార్లు ఫోన్ కాల్స్ చేశాడు. పోలీసులు అతని ఫోన్ను సీజ్ చేసి నిలదీయగా.. తాను ఆ ప్రియురాలికి పంపించి, ఆ తర్వాత డిలీట్ చేసిన మెసేజ్లలో ఏముందో ఒప్పుకోక తప్పలేదు. రాజిత చనిపోయిన వెంటనే, ఆమె మృతదేహం ఫోటోను అవినాష్ ఇండియాలోని ఆ ప్రియురాలికి వాట్సాప్లో పంపించి, ఆ చాట్ను డిలీట్ చేసినట్లు విచారణలో తేలింది.
గడిచిన ఎనిమిది నెలలుగా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అవినాష్ నార్నే అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ స్వేచ్ఛగానే తిరిగాడు. కానీ, డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసి, స్మార్ట్ లాక్ టైమింగ్స్తో లింక్ చేసిన యూఎస్ పోలీసులు.. ఇదంతా కట్టుకున్న భార్యను వదిలించుకోవడానికి అవినాష్ ముందే ప్లాన్ చేసి చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఆధారాలతో సహా కోర్టు ముందుంచారు. జూలై 7న జరిగిన కోర్టు విచారణ తో ఈ ఘాతుకానికి పాల్పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు అమెరికా చట్టాల ప్రకారం జీవితఖైదు లేదా కఠిన శిక్ష పడటం ఖాయమని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
