Hyderabad Bitcoin Scam: పెళ్లి కోసం పిల్లను వెతుక్కుందామని మెట్రీమోనీకి వెళితే.. ఉన్నదంకా ఊడ్చుకుపోయింది. పిల్ల కనిపించింది కానీ పెళ్లి చేసుకోలేదు.. అకౌంట్‌ను గుల్ల చేసింది. ఇలా ఒక చోట కాదు.. ముగ్గురుకు జరిగింది. ఈ ముగ్గురూ ఒక్కరేనా.. లేక మూడు చోట్ల ఇలానే జరిగిందా.. ఇలా చేస్తున్న ముఠా ఉందా.. అన్నది అప్పుడే తేలలేదు కానీ.. మూడు కంప్లెయింట్లు సైబర్‌ క్రైమ్‌కు వచ్చాయి. ఇందులో వాళ్లు పోగొట్టుకున్న డబ్బు కోటీ 30లక్షలకు పైనే…!

Continues below advertisement

55 లక్షలు లాగేసిన శ్రీజ..

కూకట్‌పల్లికి చెందిన ఓ ౩6 ఏళ్ల సాప్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఇంకా పెళ్లి కాలేదు. పద్మశాలీ మేట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్న తనకు శ్రీజ అనే అమ్మాయి కలిసింది. పెళ్లికి సంబంధించి ఇష్టా ఇష్టాలు పంచుకునే క్రమంలో బిజినెస్‌ గురించి కూడా మాట్లాడుకున్నారు. తాను అప్పటికే ట్రేడింగ్ చేస్తున్నా.. చాలా లాభాలు కూడా చూస్తున్నా అని చెప్పిన శ్రీజ.. ఆ టెక్కీని ముగ్గులోకి దించింది. అప్పటికే తన అకౌంట్‌లో Bitcoin.ak ద్వారా 1.9 కోట్లు వచ్చాయని చూపించింది. ఇంకేముంది తనకు కూడా వస్తాయి.. కాబోయే పెళ్లాం చెప్పింది కదా అని మురిసిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గారు.. తాను దాచుకున్న 55లక్షలూ అందులో పెట్టేశాడు.. ఆ తర్వాత దానిపై లాభాలు ఇవ్వాలంటే ఇంకో 22 లక్షలు టాక్స్ కట్టాలన్నారు. ఇదేంటని ఆ అమ్మాయిని పలకరిస్తే అమ్మడు అడ్రస్ లేదు. అప్పటికి కానీ తనకు క్షవరం అయిందని ఆయనకు అర్థం కాలేదు..  రెండు రోజుల కిందట పోలీసలకు కంప్లెయింట్ ఇచ్చాడు.

Continues below advertisement

నైస్‌గా  43 లక్షలు కొట్టేసిన రోషిణీ

ఇది కూడా కూకట్‌పల్లి కేసే..! 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కాపు కమ్యూనిటీలో కనెక్ట్ అయిన రోషిణీ.. మాటలు కలిపింది. ఆ మాటల్లో తాను పెట్టుబడులు పెడుతున్నా అని చెప్పింది. Crypto లో పెడితే ఊహించనంత డబ్బు చూడొచ్చని నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన ఆ అబ్బాయి ఏకంగా 43 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత ఆ అకౌంట్ ఫ్రీజ్ అయింది. డబ్బు రిలీజ్ చేయడానికి 12 లక్షలు అడిగారు. అతనితో డబ్బులు పెట్టించిన రోషిణీ మాట్రిమోనీ సైట్‌లో మాయం అయింది.

30లక్షలు నొక్కేసిన అశ్వినీ

ఇక మూడో కేసులో మియాపూర్‌కు చెందిన 36 ఏళ్ల టెక్కీ కూడా మోసపోయారు. అశ్వినీ రావూరి పేరుతో కమ్మ మాట్రిమోనీలో పరిచయమైందో అమ్మాయి. ప్రొఫైల్ బాగుందని ప్రొసీడ్ అయ్యాడు.. కానీ ఆమె h5.dotcoinn.com లోకి లీడ్ చేసింది. అశ్వినీ మాటలు నమ్మిన మియాపూర్ బాబు.. 30లక్షలకు పైగా ‘పెట్టుబడి’ పెట్టాడు. జూలై నుంచి అక్టోబర్ వరకూ వివిధ దశల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చిన అతనికి పోయేదే కానీ వచ్చేది ఏం లేదని అర్థం అయింది. అటు చూస్తే.. అశ్వినీ మాయమైంది. ఇక చేసేదేం లేక..  సైబర్ పోలీసులకు నాలుగు రోజుల కిందట కంప్లెయింట్ చేశాడు..

సైబర్ మోసగాళ్లతో జాగ్ర్తత్త..!

సైబర్ నేరాలు జరుగుతున్నాయి.. మోసగాళ్లతో జాగ్రత్త అని ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. జనాల్లో జాగ్రత్త పెరగడం లేదు. సైబర్ ఫ్రాడ్‌ గురించి అవగాహన ఉన్న వాళ్లే వీటిల్లో చిక్కుకోవడం విచారకరం. హైదరాబాద్ మనుషులను టార్గెట్ చేసిన ఈ మూడు మోసాలు ఒకే సమయంలో జరిగాయి.. ౩-4 రోజుల కిందటే కంప్లెయింట్లు రిజస్టర్ అయ్యాయి. UK కేంద్రంగా ఒకే ఫోన్‌ నెంబర్‌తో ఇవన్నీ జరిగినట్లు గుర్తించారు. బాధితులు వీళ్లేనా ఇంకా బయటకొస్తారా చూడాలి.