Hyderabad Kidnap: అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కలకలం - నిజమేనా? ప్రాంక్ వీడియోనా?
Mahindra Thar Kidnap: హైదరాబాద్ అత్తాపూర్లో జరిగిన కిడ్నాప్ హైడ్రామా సినీ ఫక్కీలో సాగడమే కాకుండా నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికీ ఆ యువతి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.

Attapur Girl Kidnap Case: హైదరాబాద్ అర్ధరాత్రి వేళ ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్ ప్రధాన రహదారిపై నలుగురు యువకులు ఒక యువతిని బలవంతంగా కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఆసుపత్రిలోకి పరుగులు తీసినా వదలకుండా, సినిమాల్లో చూపించే విధంగా ఆమెను ఎత్తుకెళ్లిన తీరు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.
ఆసుపత్రిలోకి వెళ్లినా వదలని కిడ్నాపర్లు!
మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు దుండగులు ఒక యువతిని లక్ష్యంగా చేసుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు సదరు యువతి ప్రాణభయంతో సమీపంలోని జాయ్ ఆసుపత్రి లోకి పరిగెత్తింది. అయితే, కిడ్నాపర్లు ఏమాత్రం జంకకుండా ఆసుపత్రి లోపలికే వెళ్లి ఆమెను ఈడ్చుకుంటూ బయటకు తీసుకువచ్చారు. నోరు మూసివేసి, బలవంతంగా కారులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల ఛేజింగ్.. సినిమా సీన్ను మించి!
స్థానికులు డయల్ 100 కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిందితుల కారును పోలీసులు వెంటాడారు. అయితే, కిడ్నాపర్లు నడిపిన నెంబర్ ప్లేట్ లేని థార్ కారు అత్యంత వేగంగా వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్స్ను దాటుకుంటూ వెళ్లడంతో పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. పోలీసుల కళ్లుగప్పి దుండగులు చీకట్లోకి మాయమైపోయారు.
బైక్పై అనుసరించిన వ్యక్తి ఎవరు?
ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే.. కారు వెనుక ఒక బైక్ కూడా నిరంతరం ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు వాడుతున్న కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడం దర్యాప్తుకు సవాలుగా మారింది. కిడ్నాప్ అయిన యువతి ఎవరు? ఆమెకు ఈ నిందితులకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేట!
రాజేంద్రనగర్ పోలీసులు ప్రస్తుతం జాయ్ ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలతో పాటు, అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న అన్ని కూడళ్లలోని ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. గతంలో ఆమెను ఎవరైనా వేధించారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. నగర నడిబొడ్డున పోలీసుల కళ్లుగప్పి కిడ్నాప్ జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కిడ్నాప్పై అందని ఫిర్యాదు
రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సదరు యువతి ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులతో మాట్లాడుతూ, తనను పికప్ చేసుకోవడానికి తన ప్రియుడి కుటుంబ సభ్యులు వస్తున్నారని చెప్పిందట. కారు , ఆక్టివాపై వచ్చిన వ్యక్తులతో ఆమె స్వచ్ఛందంగానే వెళ్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చి సుమారు 12 గంటలు గడుస్తున్నా, సదరు యువతి కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ స్టేషన్కు వచ్చి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు అందకపోయినప్పటికీ, ఆసుపత్రి నుంచి ఒక యువతిని అలా బలవంతంగా తీసుకువెళ్లడంపై పోలీసులు విచారణ ఆపలేదు. ఆ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో డీసీపీ నేతృత్వంలోని టీమ్స్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పరిసరాల్లోని సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇది కేవలం ప్రాంక్ వీడియోనా? లేక నిజంగానే తెలిసిన వారి మధ్య జరిగిన గొడవా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
Before You Go
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
ట్రెండింగ్ వార్తలు






















