DRI Seizure Hydroponic Ganja:  హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం  వేదికగా మరోసారి భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టయ్యింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. 3.05 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్  అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు.    బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయ ప్రయాణికుల నుంచి సుమారు  8.705 కిలోల  అత్యంత నాణ్యమైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Continues below advertisement

 వాటర్ బాటిళ్లు, స్నాక్స్ టిన్లలో గుట్టుగా 

తనిఖీల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు అనుసరించిన పద్ధతి చూసి అధికారులు సైతం విస్తుపోయారు. పట్టుబడిన డ్రగ్స్‌ను 24 నల్లటి ప్యాకెట్లలో ప్యాక్ చేసి.. వాటిని ఇన్సులేటెడ్ వాటర్ బాటిళ్లు, చిప్స్  టిన్లు, ఫుడ్ కంటైనర్లు, కార్డ్ బోర్డ్ బాక్సులలో అత్యంత చాకచక్యంగా దాచారు. అయితే, పక్కాగా అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో అధికారులు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అసలు రంగు బయటపడింది.  

Continues below advertisement

 హైడ్రోపోనిక్ గంజా అంటే ఏంటి? 

సాధారణ గంజాయి కంటే ఇది ఎంతో శక్తివంతమైనది , ఖరీదైనది. నేల అవసరం లేకుండా కేవలం నీటి ఆధారిత పోషకాలతో  , కృత్రిమ కాంతిలో ఇండోర్ సెటప్‌లో దీనిని సాగు చేస్తారు. ఇందులో టిహెచ్‌సి స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల డ్రగ్ మాఫియాలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే దీని ధర కోట్లలో పలుకుతుంది.

 ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు 

డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్  పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో, వారిద్దరినీ  NDPS  చట్టం  కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్న అధికారులు, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్ ఎక్కడ ఉందో, వీరు ఎవరికి డెలివరీ చేయాల్సి ఉందో ఆరా తీస్తున్నారు. 

 వరుస ఘటనలతో అలర్ట్! 

గత కొద్ది నెలలుగా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న కేసులు పెరుగుతుండటంతో కస్టమ్స్ మరియు డిఆర్ఐ అధికారులు నిఘా తీవ్రం చేశారు. మార్చి నెలలో కూడా సుమారు రూ. 9 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ వీడ్‌ను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.